Yashoda : సమంత టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘యశోద’. హరి, హరీష్ దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవటంతో థియేటర్స్లో మంచి వసూళ్లనే రాబడుతోంది. సినిమాను త్వరలోనే ఓటీటీలోనూ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
యశోద మూవీ సరోగసీ అనే పాయింట్ మీద తెరకెక్కింది. అందులో ఈవా అనే అనే సరోగసీ సెంటర్ను చూపించారు. ఈవా పేరుతో నిర్వహిస్తున్న ఓ ఆస్పత్రి యశోద సినిమాపై కోర్టు కేసు వేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సినిమా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్పందించారు. యశోద సినిమాపై కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. సినిమా ట్రైలర్ లోనూ ఈవా పేరుతో ఉన్న సెంటర్ ను చూపించామని తెలిపారు.
అసలు నిజంగా ఈవా పేరుతో ఓ ఐవీఎఫ్ సెంటర్ నడుస్తోందని తమకు తెలియదన్నారు నిర్మాత. సినిమా రిలీజ్ అయి రెండువారాలు దాటిన తర్వాత అభ్యంతరాలు రావడమేమిటని ప్రశ్నించారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ముందే తమ దృష్టికి తీసుకొస్తే తగిన వివరణ ఇచ్చేవారని యశోద చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. తాము ఏ ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నించలేదని తేల్చిచెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకపోతే యశోద మూవీ డిసెంబర్ 19న ఓటీటీ ఆమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుంది.