Prakash Raj: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న వివాదాలు రెండు.. ఒకటి జానీ మాస్టర్ వివాదం.. రెండు తిరుపతి లడ్డూ వివాదం. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు.. ఇండియా మొత్తం ఎంతో పవిత్ర ప్రదేశంగా రికార్డ్ సృష్టించింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి దేవస్థానం ఎంత ఫేమసో.. తిరుపతి లడ్డూ కూడా అంతే ఫేమస్. ఎక్కడకు వెళ్లినా తిరుపతి ప్రసాదం గురించిన చర్చ భారతీయుల్లో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ప్రసాదమే ఇప్పుడు కల్తీ అయ్యింది.
ఎంతో పవిత్రంగా చేసే ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారని, జంతువుల కొవ్వు ఉన్నట్లు సీఎం చంద్రబాబు బయటపెట్టారు. దీంతో ఒక్కసారిగా ఇండియా మొత్తం షాక్ కు గురైంది. దేవుడి ప్రసాదంలో కూడా ఇంత కల్తీనా అని ముందు ఉన్న ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంది. ఇక ఈ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన విషయం తెల్సిందే. ” తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పందికొవ్వు మరియు గొడ్డు మాంసం కొవ్వు)కలిపినట్లు బయటపడింది. ఈ విషయంలో అందరం తీవ్రంగా కలత చెందాం.
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ, ఇది దేవాలయాల అపవిత్రత, దాని భూమి సమస్యలు మరియు ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలు బయటకు వస్తున్నాయి. మొత్తం భారత్లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా మరియు వారి సంబంధిత డొమైన్లందరిచే చర్చ జరగాలి. ‘సనాతన ధర్మాన్ని’ ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి ప్రయత్నించినా మనమందరం కలిసి పోరాడాలి” అని చెప్పుకొచ్చారు.
ఇక పవన్ పోస్ట్ పై నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యాడు. నటుడిగా ప్రకాష్ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పటినుంచో ప్రకాష్ రాజ్ రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నాడు. మొదటి నుంచి బీజేపీ అంటే గిట్టని ఆయన.. ఏ సమస్య వచ్చినా బీజేపీపై నిప్పులు కక్కడానికి రెడీ గా ఉంటాడు. ఇక ఈ తిరుపతి లడ్డూ వివాదంపై కూడా ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ.. ఈ సమస్యకు కారణమైన వారందరిని శిక్షించాలని డిమాండ్ చేశాడు.
” డియర్ పవన్ కళ్యాణ్ …మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది .. దయచేసి దర్యాప్తు చేయండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు. ఈ సమస్యను జాతీయంగా ఎందుకు ఊదరగొడుతున్నారు… ఇప్పటికే దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పోస్ట్ పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024