Oscar Awards : 95వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో అట్టహాసం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఆస్కార్ వేడుకను 18.7 మిలియన్ల మంది వీక్షించారని ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన ఏబీసీ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 12 శాతం ఎక్కువ మంది ఆస్కార్ వేడుకను చూశారు. గతంలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ ‘సూపర్ బౌల్’ తర్వాత అత్యధిక మంది వీక్షించే కార్యక్రమం ఆస్కార్ వేడుక. 2018 వరకూ 30 మిలియన్ల మంది ఈ వేడుకను వీక్షించే వారు. అయితే ఆ తర్వాత ఈ వేడుకను చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 2021లో వ్యూవర్స్ షిప్ 9.85 మిలియన్లకు పడిపోయింది. గతేడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ ఏడాది మాత్రం 2.1 మిలియన్ల మంది ప్రేక్షకులు ఎక్కువగా చూడటం ఓ రికార్డు.
ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రం రేసులో రెండు బిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను సాధించిన ‘టాప్గన్: మావెరిక్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలు ఉన్నాయి. ఆ చిత్ర బృందాలు, నటీనటులు ఎవరూ ఆస్కార్ వేడుకపై కనీసం ప్రచారం కూడా చేయలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 మిలియన్ డాలర్లను వసూలు చేసిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఉత్తమ చిత్రంగా అవార్డుతో సహా ఏడు ఆస్కార్లను తన ఖాతాలో వేసుకుంది. భారత్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలు అవార్డులతో మురిశాయి.
ఎన్టీఆర్ టాప్..
ఆస్కార్ అవార్డుల వేడుక సమయంలో సోషల్ మీడియా షేక్ అయ్యింది. సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల్లో ఎన్టీఆర్ టాప్ నిలిచాడు. ఈ విషయాన్ని సోషల్మీడియాను విశ్లేషించే నెట్బేస్ క్విడ్ సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత స్థానంలో రామ్చరణ్ ఉన్నాడు. ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్’ నటుడు కె హుయ్ ఖ్యాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఆ తర్వాత ‘ది ఎలిఫెంట్ ‘విస్పరర్స్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అర్జెంటీనియా 1985’ చిత్రాలు ఉన్నాయి. నటీమణుల్లో మిషెల్ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్ పేర్లను ఎక్కువగా ప్రస్తావించారు.