Oscar Award: 2023 ఆస్కార్ అవార్డుల్లో భారత్ మెరిసింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ అవార్డును సొంతం చేసుకుంది. కార్తికి గొన్సాల్వేస్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీని డగ్లస్ బ్లష్, గునీత్ మోంగా, ఆచిన్ జైన్ నిర్మించారు.
రఘు అనే ఏనుగును బొమ్మన్, బెల్లి అనే జంట ఆదరిస్తారు. ఆ జోడికి ఆ ఏనుగుతో బలమైన బంధం ఏర్పడుతుంది. వారి మధ్య ఉన్న సహజ సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ లో అద్భుతంగా చూపించారు. ప్రకృతికి అనుగుణంగా ఉన్న గిరిజన ప్రజల జీవితాన్ని ఈ మూవీలో కళ్లకు కట్టారు. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకుల హృదయాలను ఎంతోగానే ఆకట్టుకుంది. ఇప్పుడు ఆస్కార్ అవార్డుల కమిటీని మెప్పించి అవార్డు కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
గతంలోనూ ఆస్కార్ పురస్కారాలు ..
భారతీయ సినిమాలకు గతంలో ఆస్కార్ పురస్కారాలు దక్కాయి. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా భాను అథయ్యా తొలి ఆస్కార్ అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా రూపొందిన ఆంగ్ల చిత్రమది. దర్శక దిగ్గజం సత్యజిత్ రే సినీ రంగానికి చేసిన విశేష సేవలను గుర్తించి 1992లో గౌరవ పురస్కారాన్ని ఆస్కార్ కమిటీ అందజేసింది. ఆ తర్వాత 81వ ఆస్కార్ వేడుకల్లో ‘స్లమ్డాగ్ మిలియనీర్’ చిత్రానిగానూ ఎ.ఆర్.రెహమాన్… ఉత్తమ ఒరిజినల్ సాంగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో రెండు అవార్డులు దక్కించుకున్నారు. బెస్ట్ సౌండింగ్ మిక్సింగ్ విభాగంలో రసూల్, బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో రచయిత గుల్జార్ ఆస్కార్ సొంతం చేసుకున్నారు. ‘స్లమ్డాగ్ మిలియనీర్’ కూడా ఆంగ్ల చిత్రమే. 2019లో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఢిల్లీకి చెందిన గునీత్ మోంగా నిర్మించిన ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ ఎ సెంటెన్స్’కి ఆస్కార్ దక్కింది. ఇప్పుడు ది ఎలిఫెంట్ విష్పరర్స్ అవార్డు సొంతం చేసుకుంది.