NTR30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ మొదలుపెట్టకముందు నుంచే ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ డైరెక్టర్ అనగానే అంచనాలు మరింత పెరిగాయి. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ప్రకటించగానే NTR30 మూవీకి హైప్ మరింత వచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్ నందమూరి అభిమానుల్లో జోష్ పెంచింది. చాలారోజుల నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలపుతుందా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వచ్చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమం తర్వాత నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిత్రబృందానికి స్క్రిప్ట్ ను అందజేశారు. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ పై తీసిన ముహూర్తపు షాట్ కు దర్శకధీరుడు రాజమౌళి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కల్యాణ్ రామ్ పాల్గొన్నారు.
NTR30 షూటింగ్ ప్రారంభోత్సవ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #NTR30, #NTR30StormBegins లాంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
NTR30 మూవీ షూటింగ్ ప్రారంభ కార్యక్రమంలో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్రబృందాన్ని సరదా పలకరిస్తూ కనిపించింది. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ను కలిసిన సమయంలో ఫుల్ ఖుషీ అయిపోయింది. ఎన్టీఆర్ పలకరించగానే జాన్వీ ఎంతో హ్యాపీగా ఫీలైంది. యంగ్ టైగర్ తో కాసేపు సరదాగా మాట్లాడింది. జక్కన్నతో జాన్వీ ముచ్చట్లు పెట్టింది. ఇలా షూటింగ్ స్పాట్ లో తొలిరోజే జాన్వీ ఎంతో సందడి చేసింది.
బ్యాక్ డ్రాప్ ఇదేనా..?
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న రెండో సినిమా ఇది. ఓ తీర ప్రాంత బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథను రూపొందించామని చిత్రయూనిట్ తెలిపింది. “ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాళ్లు ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఇదే ఈ సినిమా బ్యాక్డ్రాప్. వారిని భయపెట్టడానికి హీరో పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది ఈ సినిమా కథ” అని వెల్లడించింది.