NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారిన విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం, ఆచార్య తరువాత కొరటాల నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు దేవరపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.
ఇప్పటికే దేవర నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ లాంటి సెలబ్రిటీలతో ఎన్టీఆర్, కొరటాల శివ ఇంటర్వ్యూలు చేసి మరింత అంచనాలను పెంచేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. దేవరలో మీకు బాగా చిరాకు తెప్పించిన సీన్ ఏది అని అడిగితే.. గోవా షెడ్యూల్ అని తెలిపాడు. ” గోవా షెడ్యూల్ లో నాకు బీపీ పెరిగిపోయింది. ఫుల్ ఎండ. అస్సలు తట్టుకోలేకపోయాను. నిప్పుల వర్షం కురుస్తుందా అనేంతలా .. చెమటలు ఆగేవే కాదు. అంత ఎండలో కూడా నవ్వుతూ డైలాగులు చెప్పాలి.
చచ్చిపోతానేమో అనుకున్నా.. ఎలాగోలా సీన్ ఫినిష్ చేసి ఏసీ రూమ్ లోకి వెళ్లి పడుకుంటే.. అప్పుడే కరెంట్ పోయింది. జనరేటర్ అంతకు ముందు రోజే పాడయ్యిందంట. అసలు రూమ్ లో ఉండాలో.. బయటకు పోవాలో అర్ధం అయ్యేది కాదు. 40 నిమిషాల తరువాత కరెంట్ వచ్చేది. అలా కొంచెంసేపు పడుకుందాం అనేలోపు షాట్ రెడీ అని పిలిచేవారు. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.