Nikhil : ఈ మధ్య విడుదలవుతున్న కొన్ని చిత్రాల చుట్టూ ఆటోమెటిక్గా వివాదాలు చుట్టుకుంటున్నాయి. మరి కొన్ని చిత్రాలు ఓ రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉన్నాయనే పేరుని మూటగట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలపైనే ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలుగు హీరో చేస్తోన్న సినిమాలకు అలాంటి న్యూస్ రావటం అనేది హాట్ టాపిక్గా మారింది. ఆ సినిమాయే స్పై. ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ హీరో. ఈయన నటించిన గత చిత్రం కార్తికేయ 2 పాన్ ఇండియా మూవీగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో స్పై చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ చేస్తున్నారు.
అయితే స్పై చిత్రంపై కూడా ఇప్పుడు పైన పేర్కొన్నట్లు వార్తలు రావటం మొదలయ్యాయి. అందుకు కారణం.. నేతాజా సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న మిస్టరీని చేదించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కొన్నాళ్లు ముందు అంటే కార్తికేయ 2 విడుదలైన తర్వాత నిఖిల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాల్సింది. అయితే అదే సమయంలో నితిన్ ఆయన్ని కలిశాడు. పేర్లలో కన్ఫ్యూజన్ కారణంగానే నిఖిల్ స్థానంలో అమిత్ షాను నితిన్ కలిశారంటూ వార్తలు వచ్చాయి. అప్పట్లో దీనిపై ఎవరూ స్పందించలేదు. తాజాగా హీరో నిఖిల్ దీనికి వివరణ ఇచ్చారు.
‘‘నిజానికి నాకు అమిత్ షాగారి నుంచి పిలుపు వచ్చింది. ఓ పబ్లిక్ మీటింగ్కు రమ్మన్నారు. నేను వెళితే ఎజెండాలు.. అదీ ఇదని మాట్లాడుతారు. అలాంటివి నాకు నచ్చవు. సినిమా సినిమాగా ఉండాలనుకుంటున్నాను. నాకు రాజకీయాలు వద్దు, వాటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నన్ను ఆహ్వానించిన అమిత్ షాగారికి థాంక్స్. మా వెనుక ఏ పొలిటికల్ పార్టీ లేదు’’ అని అన్నారు హీరో నిఖిల్. స్పై చిత్రం జూన్ 28న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. గ్యారీ బి.హెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.