Nikhil Siddhartha: సినీ పరిశ్రమలో పనిచేసే వారి గురించి బయట ప్రపంచంలో ఎన్నో రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అందులో అందరూ డ్రగ్స్కు అలవాటుపడిన వారే ఉంటారని, పార్టీలు లాంటివి చేసుకుంటూ ఉంటారని.. ఇలా ఎన్నో వదంతులు షికార్లు చేస్తుంటాయి. కొన్ని సందర్భాలను బట్టి అవి నిజమే అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ తను అలా కాదంటూ హీరో నిఖిల్ చెప్పుకొచ్చాడు. ‘స్పై’ సినిమా ప్రమోషన్స్లో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.
నిఖిల్.. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకునే హీరోగా టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగా పరిచయమయిన తర్వాత చాలాకాలం వరకు నిఖిల్కు ఒక్క హిట్ కూడా లేక మినిమమ్ మార్కెట్ కూడా ఏర్పడలేదు. కానీ ఎప్పుడైతే.. డిఫరెంట్ కథలపై దృష్టిపెట్టాడో.. అప్పటినుండి హీరోగా నిఖిల్ కెరీరే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నిఖిల్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అని మేకర్స్తో పాటు ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు.
నిఖిల్ చివరి చిత్రం ‘కార్తికేయ 2’ బ్లాక్బస్టర్ హిట్ను అందుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఇది హిందీలో కూడా పెద్ద సక్సెస్ అయ్యింది. అందుకే ఇకపై పాన్ ఇండియా చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు నిఖిల్. జూన్ 29న ‘స్పై’ అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుభాష్ చంద్రబోస్ మరణం గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ సినిమా ద్వారా చెప్పనున్నాడు. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు.
స్పై ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన పరివర్తన అనే ప్రోగ్రామ్లో నిఖిల్ పాల్గొన్నాడు. డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలను అక్కడ ఆడియన్స్తో చర్చించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనను డ్రగ్స్ తీసుకోమని చాలామంది అడిగారని, కానీ తను దానికి ఒప్పుకోలేదంటూ నిఖిల్ బయటపెట్టాడు. అందుకే విద్యార్థులను డ్రగ్స్కు దూరంగా ఉండమని కోరాడు. త్వరలోనే డ్రగ్ ఫీ తెలంగాణను చూడాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టాడు.