Niharika Konidela about Pawan Kalyan(Tollywood celebrity news): మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తుంది. ఒక మనసు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. దీంతో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది. అయితే ఆ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య విభేదాలు వలన విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇక విడాకుల తరువాత మళ్లీ నటిగా మారింది. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ లో నటించిన నిహారిక ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు తన నిర్మాణంలో ఒక సినిమా రాబోతుంది. అదే కమిటీ కుర్రాళ్లు. కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నిహారిక.. తన పాపులారిటీని ఉపయోగించి గట్టిగా ప్రమోట్ చేస్తుంది. తాజాగా ఈ చిన్నది సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
10 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తిచేసి సీజన్ 2 ను కూడా ముగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సక్సెస్ సెలబ్రేషన్స్ పేరుతో చివరి ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. ఇక సెలబ్రేషన్స్ కు నిహారిక హాజరయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం గా గెలవడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.
పవన్ గెలిచాక.. చిరంజీవి ఇంటికి వెళ్లడం, అక్కడ మెగా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూపించారు. ఇక ఆ వీడియో చూసిన నిహారిక.. ” యుద్ధం గెలిచాక రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలాగే ఉండిందేమో అనిపించింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.