Natanshi Goel : బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య, లేడి డైరెక్టర్ కిరణ్రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్” చిత్రం ఇప్పుడు ఆస్కార్ 2025 రేసులో చేరింది. సెప్టెంబరు 23న ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ చిత్రం అకాడమీ అవార్డులలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సినిమాతో పాటు అందులో నటించిన స్టార్స్ గురించి కూడా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్న ఫూల్ కుమారి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె వయసు. అసలు ఈ హీరోయిన్ ఎవరు? ఆమె వయసు ఎంత? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
టీనేజ్ లోనే చరిత్ర సృష్టించిన పూల్ కుమారి
కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ సినిమాలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ, రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించిన రవి కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని అమీర్ ఖాన్ స్వయంగా నిర్మించడం విశేషం. ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ ఏడాది మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 4 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించడంతో పాటు మేకర్స్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆస్కార్ వేదికపై సత్తా చాటడానికి సిద్దమవుతున్న లాపతా లేడీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ అందుబాటులో ఉంది. కాగా అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో ఫూల్ కుమారిగా నటించి తన అందం, అభినయం, అమాయకత్వంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ పేరు నితాన్షి గోయల్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆమె వయసు కేవలం 17 ఏళ్లు. టీనేజ్ లోనే లాపతా లేడీస్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నితాన్షి తన నటనతో అబ్బురపరిచింది. ఇప్పుడు ఆమె వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే కావడం విశేషం. ఇలా టీనేజ్ లోనే ఆస్కార్ రేసులో నిలబడిన ఘనత ఈ అమ్మడికే దక్కింది.
నితాన్షి గోయల్ ఎవరు?
ఇక పూల్ కుమారిగా ఆకట్టుకున్న నితాన్షి గోయల్ ఎవరు ? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన నితాన్షి ఈ సినిమాతోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఆమె కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. కానీ అంతకంటే ముందే నితాన్షి చాలా సినిమాలలో, యాడ్స్ లో నటించింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో కలిసి తన ఫస్ట్ యాడ్ షూట్ చేసింది ఈ అమ్మడు. కాగా నితాన్షి లాపతా లేడీస్ కంటే ముందు ‘విక్కీ డోనర్’, ‘ఎంఎస్ ధోని’, ‘ఇందు సర్కార్’తో పాటు పలు ఇతర చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఇక ఇప్పుడు లాపతా లేడీస్ తో ఆమెకు మరింత పాపులారిటీ దక్కడంతో పాటు బాలీవుడ్ లో ఈ టీనేజ్ బ్యూటీకి మరిన్ని అవకాశాలు రావచ్చు.