Balakrishna: సినీ నటుడు తారకరత్న మృతితో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా బాలకృష్ణ తారకరత్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆసుపత్రిలో వెన్నంటే ఉండి కంటికిరెప్పలా చేసుకున్నప్పటికీ తారక్ ప్రాణాలు దక్కకపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
తారకరత్న అంటే బాలకృష్ణకు చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఉన్నప్పటికీ తారకరత్నపై కాసింత ఎక్కువ ప్రేమ చూపించేవారు. నటుడిగా, వ్యక్తిగతంగా ప్రతి విషయంలోనూ తారకరత్నను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. చేయిపట్టుకొని నడిపించేవారు. తారకరత్న రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని తెలుసుకొని.. టీడీపీలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారట బాలయ్య.
ఇంతలోనే తారకరత్న యువగళం పాదయాత్రలో కుప్పకూలిపోవడంతో .. బాలకృష్ణ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. బెంగళూరులోనూ తారకరత్న వెంటనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నారు. రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం గురించి ఆరా తీస్తుండేవారు. విదేశాల నుంచి వైద్యులను కూడా రప్పించి చికిత్స అందించారు.
ఇక తారకరత్న పిలుపును గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు బాలయ్య. బాల బాబాయ్ అంటూ తనను ఆప్యాయంగా పిలిచేవాడని.. ఇక ఈ పిలుపు వినబడదన్న ఊహను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. పూర్తిగా కోలుకొని మృత్యుంజయుడిలా తిరిగి వస్తాడని ఆశించామని.. కానీ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్తాడని ఊహించలేదని కన్నీళ్లుపెట్టుకున్నారు.