మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ మూవీ మరికొద్ది రోజుల్లో అంటే జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించగా.. అందులో మహేశ్ స్పీచ్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘‘మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్లో మా సినిమా విడుదలైతే బ్లాక్ బస్టరే. కానీ ఇప్పుడు నాన్న లేరు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న, అన్నీ’’ అని అన్నారు. దీంతో మహేశ్ ఎమోషనల్ స్పీచ్కి అంతా ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ భార్య నమ్రత ఇన్స్టాలో షేర్ చేస్తూ అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
‘‘మహేశ్ గురించి ఎంతోమంది ఇప్పటికే గొప్పగా చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు అతనిపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. ఆ ప్రేమతోనే అతనిని మరింత కష్టపడి పనిచేసేలా చేశారు. ఇక గుంటూరు ప్రీరిలీజ్ ఈవెంట్ను ఉద్దేశించి.. గుంటూరులో అభిమానుల చూపించిన ప్రేమను చూసి ఓ విషయాన్ని గర్వంగా చెప్పాలనుంది. మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్. ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను’’ అంటూ రాసుకొచ్చింది.