Nagababu: ఏపీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడమే దానికి కారణం. జనసేనకు సపోర్ట్ గా నిలబడకుండా వైసీపీ నేతకు సపోర్ట్ గా నిలబడి.. వైసీపీ నేత ఇంటికి వెళ్లడం.. మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ కే కాదు బన్నీ ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. దీంతో అప్పుడు మొదలైన ట్రోలింగ్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఇక అప్పట్లో నాగబాబు చేసిన ట్వీట్ కూడా సెన్సేషన్ సృష్టించింది.అల్లు అర్జున్ నంద్యాల పర్యటన అనంతరం ఒక ట్వీట్ చేశాడు. ” మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ రాసుకొచ్చాడు. ఇక రగిలే మంటపై నూనె పోసినట్లు.. ట్రోలర్స్ కు ఈ ట్వీట్ మరింత హైప్ ను ఇచ్చింది. దీంతో మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు మొదలయ్యాయి అని, చిరు మాట్లాడలేక నాగబాబుతో మాట్లాడిస్తున్నాడని రకరకాల ట్రోల్స్ వచ్చాయి.
ఇక రెండు రోజుల తరువాత నాగబాబు ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. ఎన్నికలు ముగిసాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. అల్లు అరవింద్.. పవన్ ను మీట్ అయ్యాడు. ఇన్ని జరిగినా సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ పై నెగెటివిటీ మాత్రం పోలేదు. మెగా ఫ్యామిలీ.. కెమెరా కంటికి చిక్కడం ఆలస్యం ఇదే ప్రశ్నను లేవనెత్తుతుంది మీడియా. కమిటీ కుర్రాళ్ళు నిర్మాత నిహారికకు కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది. అలా చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. మెగా ఫ్యామిలీ లో ఇలాంటి అంశంపై చర్చనే రాలేదు అని నిహారిక సైలెంట్ గా సైడ్ అయిపోయింది.
ఇక ఇప్పుడు నాగబాబుకు అదే ప్రశ్న ఎదురయ్యింది. నాగబాబు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం అందరికి తెల్సిందే. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. అభిమానులు అడిగినప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాడు. ఇక చిట్ చాట్ సెషన్ లో ఫ్యాన్స్ ఎక్కువ అల్లు అర్జున్ వివాదం గురించే మాట్లాడారు.
అల్లు అర్జున్ సంగతి ఏంటి బాబాయ్ అని అడగ్గా.. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నాను అని సమాధానమిచ్చాడు. ఇంకొక అభిమాని.. అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అన్న ప్రశ్నకు.. హార్డ్ వర్కింగ్ అని చెప్పి ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.