Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వివాదం రోజురోజుకు ముదురుతోంది. వేణుస్వామి ఈమధ్యనే నాగ చైతన్య, శోభితల జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. వారు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్ మెంట్ చేసుకుంటే.. వేణుస్వామి వారి జాతకాల్లో కలిసి ఉండే యోగం లేదని, మరో అమ్మాయి వలన ఈ జంట విడిపోతారని చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
అంతేకాకుండా చైకు పిల్లలు పుట్టరని, సమంత జాతకం కన్నా, శోభితా జాతకం చాలా దరిద్రంగా ఉందని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో మీడియాలోని ఓ వర్గం వేణుస్వామి మీద మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ లోని కొందరు జర్నలిస్టులు.. మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారదను కలుసుకొని వేణుస్వామిపై ఫిర్యాదు చేశారు. ఇలాంటివారిని ఊరికే వదలకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక దీంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారద.. వేణుస్వామికి నోటీసులు పంపారు. ఈ వివాదంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారద స్పందిస్తూ.. వేణుస్వామిని ఆగస్టు 22 న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీచేశారు. ఇందుకు సంబంధించిన నోటిస్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇకపోతే ఇప్పటికే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చెప్పడం వలన తాను ఇలాంటి సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని వీడియో రిలీజ్ చేశాడు వేణుస్వామి. మరి ఈ విచారణలో వేణుస్వామి అదే మాట చెప్తాడా.. ? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.