Keeravani: రాంగోపాల్ వర్మ.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. వివాదాలు అతని వెంట రావడం కాదు.. వివాదాలనే అతడు వెతుక్కుంటూ వెళ్తాడు. నిత్యం ఏదో ఒక అంశంపై తనదైనస్టైల్లో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. అతడిని ప్రేమించే వారికంటే ద్వేశించే వారే ఎక్కువ. అలాంటి వ్యక్తిని దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి దేవుడితో పోల్చాడు. పొగడ్తలతో ముంచెత్తాడు.
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీరవాణి.. రామ్ గోపాల్ వర్మే తన మొదటి ఆస్కార్ అని అన్నారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణం క్షణం సినిమా తన కెరీర్కు మంచి ఊతాన్ని ఇచ్చిందని వెల్లడించారు.
‘‘ఇప్పుడు వచ్చిన అవార్డ్ నాకు రెండోది. రాంగోపాల్ వర్మే నా మొదటి ఆస్కార్. నేను మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశాల కోసం ఎంతో మందిని కలిశాను. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నా మ్యూజిక్ క్యాసెట్లను చెత్తబుట్టలో పడేశారు. అటువంటి సమయంలో రామ్ గోపాల్ వర్మ తన క్షణం క్షణం సినిమాలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నాకు అవకాశాలు క్యూ కట్టాయి. రామ్ గోపాల్ వర్మ నా కెరీర్లో ఆస్కార్ పాత్ర పోషించారు. ఆయనే నా మొదటి ఆస్కార్’’ అని వెల్లడించారు కీరవాణి.
ఇక దీనిపై ఆర్జీవీ తనదైనశైలిలో స్పందించారు. కీరవాణి వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘‘నేను చనిపోయిన భావన కలుగుతోంది. ఎందుకంటే చనిపోయిన వాళ్లనే ఇంత గొప్పగా పొగుడుతారు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది.