Megastar Chiranjeevi, Nandamuri Balakrishna meet at Hyderabad marriage function: ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు కలిసారీ జంట..అంటూ మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ సంతోషంతో ఊగిపోతున్నారు. అవును ఆ ఇద్దరూ కలిసి ఫ్యాన్స్ కే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు సంతోషాన్ని ఇచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించాలని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందుకు తగిన కథ ఎవరూ చెప్పకపోవడమో లేక ఇద్దరికీ నటించాలనే కోరిక లేకనో కానీ ఈ కలయిక సాధ్యం కాలేదు. ఇద్దరికీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. చిరంజీవికి, బాలకృష్ణకు ప్రతి సంక్రాంతికి లేక దసరాకి తప్పనిసరిగా వాళ్ల సినిమాలతో పోటాపోటీ ఉండేది. ఇద్దరూ మాస్ లీడర్లే. ఒకరు ఫైటింగుల్లో దిట్ట అయితే మరొకరు డైలాగ్ కింగ్. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందని అంతా అనుకుంటారు. కానీ ఇద్దరూ కలిస్తే ఎంతో అభిమానంతో షేక్ హ్యాండ్స్, కౌగిలింతలు ఇచ్చుకుంటారు. అయితే ఈ అరుదైన కలయిక శనివారం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ వేదిక
ప్రముఖ సినీ గేయ రచయిత హరిరామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. వేదికకు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవిని చూడగానే అప్పటికే ముందుగా వచ్చి కుర్చీలోఆసీనుడయిన బాలకృష్ణ వినమ్ర పూర్వకంగా నిలబడి చిరంజీవి చేతిని తన చేతిలోకి తీసుకుని విష్ చేశారు. ఇద్దరూ కలిసి చాలా సేపు ముచ్చటించుకున్నారు. అయితే ఈ అపురూప దృశ్యాన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో వీక్షించి అభిమానులంతా తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ లు కూడా హాజరయ్యారు.
బాలయ్య కు స్వర్ణోత్సవం
త్వరలోనే టాలీవుడ్ పరిశ్రమ బాలకృష్ణను విశేష రీతిలో సన్మానించనుంది. బాలకృష్ణ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులంతా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడుగా మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఇక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా రానున్నారు.
#Chiranjeevi and #NBK ❤️
— Suresh PRO (@SureshPRO_) August 24, 2024