Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. నేడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి మరీ కలిశారు. అయితే పండుగ పూట.. చిరు, చంద్రబాబు ఎందుకు కలుసుకున్నారు నాటే.. ఈ మధ్య వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఏపీలో వరద.. ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలు చిక్కుకున్నప్పుడు.. టాలీవుడ్ మొత్తం తమ వంతు సాయంగా విరాళాలు అందజేస్తూ ఉంటుంది. అందులో మెగాస్టార్ మరీ ముందు ఉంటారు.
ఇక ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి రూ.కోటి విరాళంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే విరాళాలు ప్రకటించిన సెలబ్రిటీలు అందరూ సీఎం చంద్రబాబును కలిసి ఆయనకు చెక్కులు అందజేశారు. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి.. సీఎం ఇంటికి వెళ్లి మరీ.. కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
చిరంజీవి చేసిన సాయాన్ని చంద్రబాబు ప్రశంసించారు. సేవా కార్యక్రమాలు చేయడంలో మెగాస్టార్ ఎప్పుడు ముందే ఉంటారని ఆయన కొనియాడినట్లు సమాచారం. అంతేకాకుండా చిరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారట. కొద్దిసేపు వీరిద్దరూ సినిమాల గురించి, రాజాయీయల గురించి ముచ్చటించుకున్నారని తెలుస్తోంది. వీరితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉంటే బావుండేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
ఇక చిరు సినిమాల గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం ఆయన విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు. నేడు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి.. ట్రోల్ అవుతున్న విషయం తెల్సిందే. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ టీజర్ లో విఎఫ్ఎక్స్ అంతగా బాగోలేదని, టీజర్ నచ్చలేదని పెదవి విరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.