టాలీవుడ్ సీనియర్ నటుడు, నటశేఖర కృష్ణ అందరినీ విడిచి సుదూర లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఆయన సినిమాలు, వ్యక్తిత్వంతో మన మధ్యలోనే ఉంటారనటంలో సందేహం లేదు. అయితే తన తండ్రిని ఎంతగానో ప్రేమించే అభిమానుల కోసం కృష్ణ మెమోరియల్ను ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందులో కృష్ణ విగ్రహంతో పాటు ఆయనకు సంబంధించిన అరుదైన ఫొటోలను, ఆయన సాధించిన ఘనతలు, అవార్డులను ఉంచబోతున్నారు. అది కూడా కృష్ణ స్థాపించిన పద్మాలయా స్టూడియోస్లోనే అని సమాచారం. దీనికి సంబంధించి మరింత క్లారిటీ త్వరలోనే రానుందని సినీ వర్గాలు అంటున్నాయి. కృష్ణ కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, సినీ ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మూడు షిఫ్టులలో పనిచేస్తూ నిర్మాతల పాలిట కల్ప వృక్షంలా కృష్ణ 350కి పైగా చిత్రాల్లో నటించారు. సామాన్య నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన సూపర్స్టార్ డమ్తో మాస్ ఇమేజ్ను సంపాదించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆయన తనదైన అధ్యాయాన్ని రాశారు. తెలుగు సినిమాను సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కించిన ఘనత కృష్ణకే దక్కుతుంది. ఇప్పుడాయన నట వారసుడిగా సూపర్స్టార్ మహేష్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.