Mahendragiri Varahi : అక్కినేని హీరో సుమంత్ (Sumanth) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరావు పెద్ద కుమార్తె సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతులకు జన్మించిన కుమారుడే సుమంత్ కుమార్ యార్లగడ్డ. 1999లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన, ఆ తర్వాత యువకుడు అనే సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. 2003లో జెనీలియాతో కలిసి నటించిన సత్యం సినిమాతో ఇండస్ట్రీలో సెటిలైపోయారు. ఆ తర్వాత వచ్చిన గౌరీ సినిమా మంచి విజయాన్ని అందించి, మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. తన అద్భుతమైన నటనతో ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత కాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోయారు.
ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడిన సుమంత్..
అలా కొన్ని సంవత్సరాల పాటు వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న సుమంత్, మళ్ళీ 2006లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమాతో మళ్లీ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. ఇక గోల్కొండ హై స్కూల్ , మళ్లీ రావా వంటి చిత్రాలు సుమంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2021 లో చివరిగా కపటదారి, అనగనగా ఒక రౌడీ వంటి చిత్రాలలో నటించిన ఈయన ఆ తర్వాత హీరోగా నటించలేదు. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో కీలక పాత్ర పోషించి మెప్పించారు సుమంత్.
మహేంద్రగిరి వారాహి తో హీరోగా..
ఇక ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాల పాటు హీరో పాత్రకు విరామం ఇచ్చిన సుమంత్.. ఇప్పుడు మళ్ళీ తాజాగా “మహేంద్రగిరి వారాహి” అనే సినిమాతో మళ్లీ హీరోగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. రాజశ్యామల బ్యానర్ పై వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను తాజాగా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ విడుదల చేశారు. అంతేకాదు ఇది చాలా అద్భుతంగా ఉంది అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్సేన్ పోస్ట్ కూడా చేయడంతో ఈ గ్లింప్ కి మరింత స్పందన లభించింది.
2025 సంక్రాంతి బరిలో దిగనున్న సుమంత్..
మహేంద్రగిరి వారాహి సినిమాలో విలక్షణ నటుడు బ్రహ్మానందం కూడా నటిస్తున్నట్లు ఈ సినిమా చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు స్పష్టం చేశారు. మహేంద్రగిరి వారాహి స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని అందుకే బ్రహ్మానందం కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సంతోష్ జాగర్లపూడి తెలిపారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకున్నారట.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇక 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ అంటే పెద్ద హీరోలు చాలామంది పోటీపడతారు. ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో పాటూ చాలా సినిమాలు పోటీకి దిగుతున్నాయి. మరి ఇంత పోటీ మధ్య సుమంత్ తట్టుకోగలరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దీంతో అభిమానులు కూడా సుమంత్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.