Nayanthara X Handle Hacked: గత కొంతకాలంగా హ్యాకర్లు సెలబ్రిటీలకు షాక్ ఇస్తున్నారు. పలువురు హీరో, హీరోయిన్లకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ లిస్టులో చేరింది. ఆమె అధికారిక X హ్యాండిల్ ను ఆగంతకులు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని నయనతార అఫీషియల్ గా వెల్లడించింది.
దయచేసి ఆ మెసేజ్లకు, ట్వీట్లకు స్పందించకండి
తన X హ్యాండిల్ నుంచి వచ్చే మెసేజ్ లు, ట్వీట్లకు స్పందించ కూడదని నయనతార తన అభిమానులకు వెల్లడించింది. ఇప్పటికే తన అకౌంట్ హ్యాక్ కు సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు వెల్లడించిన ఆమె, త్వరలో తన అకౌంట్ రికవరీ అవుతుందని చెప్పుకొచ్చింది. “నా అకౌంట్ హ్యాక్ అయ్యింది. దయచేసి అనవసర, అసభ్య మెసేజ్ లు పోస్టు అయినా పట్టించుకోకండి” అని వెల్లడించింది. ప్రస్తుతం ఈమె చేసి ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆగస్ట్ 2013లో మైక్రోబ్లాగింగ్ సైట్ లో చేరిన నయనతారకు ఈ ప్లాట్ ఫారమ్లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
నయనతార అభిమానుల ఆందోళన
Also Read: వేణుస్వామిపై కేసు నమోదుకు ఆదేశాలు.. వివాదాస్పద జ్యోతిష్యుడికి నాంపల్లి కోర్టు ఝలక్!
నయనతార X అకౌంట్ హ్యాక్ అయ్యిందని ప్రకటించడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె పోస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రియాక్ట్ అవుతున్నారు. “వెరిఫైడ్ అకౌంట్ ఎలా హ్యాక్ అయ్యింది? బ్లూ టిక్ ఉన్నా భద్రత కల్పించడంతో X యాజమాన్యం విఫలం అయ్యింది” అని ఓ నెటిజన్ రాశాడు. “ఇది నిజంగా షాకింగ్ విషయం. హ్యాకర్లు తరచుగా సెబ్రటిటీలను టార్గెట్ చేస్తున్నారు. మీ అకౌంట్ హ్యాక్ అయినందుకు ఇబ్బంది పడకండి. మీ అకౌంట్ సేఫ్ గా ఉంచుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి. మీ అభిమానులు ఎప్పుడూ మీకు సపోర్టుగా ఉంటారు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
నయనతార సినిమాల గురించి..
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార చివరిసారిగా ‘జవాన్’ మూవీలో కనిపించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి ఈ సినిమాలో నటించింది. ఈ మూవీతోనే ఆమె బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రంలో ఆమె పవర్ ఫుల్ ఎన్ఎస్జీ ఆఫీసర్ నర్మదా రాయ్ పాత్రలో కనిపించింది. ‘జవాన్’ సినిమా త్వరలో జపాన్ లో విడుదలకాబోతోంది. తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ విక్రమ్ రాథోడ్, అతడి కొడుకు ఆజాద్ గా డ్యుయెల్ రోల్ పోషించారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించారు. నయనతార, షారూఖ్ తో పాటు దీపికా పదుకొనే, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, ప్రియమణి, సంజీతా భట్టాచార్య, సునీల్ గ్రోవర్, గిరిజా ఓక్, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి ఇతర పాత్రల్లో కనిపించారు. తెలుగులో చివరగా ‘గాడ్ ఫాదర్’ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ‘తని ఒరువన్ 2’, ‘టెస్ట్’, ‘మన్నన్ గట్టి 1960’, ‘డియర్ స్టూడెంట్స్’ అనే మూవీస్ లో నటిస్తోంది.