Laapata Ladies Supreme Court| చిన్న సినిమాగా విడుదలై సినీ విమర్శుకుల ప్రశంసలు సైతం అందుకున్న సూపర్ హిట్ హిందీ సినిమా ‘లాపతా లేడీస్’ ప్రత్యేక స్క్రీనింగ్ సుప్రీం కోర్టులో శుక్రవారం జరిగింది. ఈ సినిమాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు వారి సతీమణులతో పాటు తిలకించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మాతగా, ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిళా శక్తిని గ్రామీణ నేపథ్యంలో అద్యంతం హాస్యభరితంగా చూపించారు. ప్రముఖ రచయిత బిప్లబ్ గోస్వామీ రచించిన ‘లాపతా లేడీస్’ సినిమాలోని గ్రామీణ యాస డైలాగులు.. నటీనటుల అమాయక నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతమైంది. థియేటర్లలో 50 రోజులపాటు విజయవంతంగా ప్రదర్శన కొనసాగిన తరువాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది.
Also Read: నీల్ కు ఎన్టీఆర్ తో సినిమా చేయడం ఇష్టం లేదా..?
కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా కావడంతో ఈ సినిమాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమాను సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. శుక్రవారం, ఆగస్టు 9, 2024న సుప్రీం కోర్టు సి బ్లాక్ అడ్మిన్ బిల్డింగ్ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని 4.15 నిమిషాలకు ప్రదర్శించారు. న్యాయమూర్తులతో పాటు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ శాఖ సిబ్బంది కూడా ఈ సినిమాను చూశారు.
‘లాపతా లేడీస్’ థియేటర్లలో మార్చి 1, 2024న విడుదలై మొదటి రోజు కేవలం రూ.75 లక్షలు మాత్రమే బాక్సాఫీస్ కలెక్షన్ సాధించింది. కానీ తొలి వారంలో సినిమా రూ.6.05 కోట్ల కలెక్షన్ సాధించడంతో సినీ విమర్శుకుల ఈ సినిమాను సీరియస్ గా తీసుకున్నారు. థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మొత్తం రూ.17.31 కోట్లు కలెక్షన్ వచ్చింది. తక్కువ బడ్జెట్, అది కూడా కొత్త నటీనటులతో విడుదలైన సినిమాకు రూ.17 కోట్ల కలెక్షన్ రావడం.. పైగా సినీ విమర్శకులు, సెలెబ్రిటీలు కుటుంబ సమేతంగా మంచి కథతో సినిమా తీశారంటూ ప్రశంసించడంతో ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.