Kushboo : ఖుష్బూ కోలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి. ముక్కుసూటిగా మాట్లాడేతత్వం ఆమెది. గతంలో తనపై ట్రోలింగ్ చేసేవారికి దిమ్మ తిరిగే కౌంటర్లు ఇచ్చారు. దక్షిణాదిలో కథానాయుకగా ఒక వెలుగు వెలిగిన ఖుష్భూ నటిగా రెండో ఇన్నింగ్స్ లోనూ ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితులయ్యారు.
తాజాగా ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తనకు 8 ఏళ్ల వయస్సులో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. తాను ఆ వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యాయని వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఎవరో కాదని తన తండ్రేనని గతాన్ని గుర్తు చేసుకున్నారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని పాతగాయాల గురించి వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖుష్భూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎవరైనా సరే చిన్నతనంలో వేధింపులకు గురైతే ఆ ఘటనలు జీవితాంతం భయానికి గురి చేస్తాయని ఖుష్భూ వ్యాఖ్యానించారు. భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని హక్కుగా భావించే వ్యక్తి వల్ల తన తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని చెబితే అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డానని ఖుష్భూ అన్నారు. ఎందుకంటే తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం తన తల్లిదని చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల వయసులో తండ్రికి ఎదురుతిరగానని ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయాడని నాటి చేదుజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
హీరోయిన్గా కెరీర్ పీక్ లో ఉండగానే దర్శకుడు సుందర్ను ఖుష్బూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అవంతిక, ఆనందిక అనే ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. గతంలో ఖుష్భూ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. దానిపై కొందరు విపరీత ధోరణిలో కామెంట్లు పెట్టారు. ఆమె కుమార్తెల బరువు,శరీరాకృతిపై కామెంట్స్ చేశారు. అప్పుడు కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టిన వారికి ఖుష్బు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి విషయంపైనైనా నిర్భయంగా మాట్లాడే కుష్భూ ఇప్పుడు తండ్రిపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.