Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలవరీతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టి .. ఆపై విలన్ గా మారీ .. కథానాయకుడిగా , రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. నేడు కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..
రెబల్ స్టార్ కృష్ణంరాజు నవరసాల్లోని ఏ రసాన్నైన అలవోకగా పండించి , ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. వ్యక్తిగా అందమైన చిరునవ్వు, చక్కని పలకరింపు, కళ్ళల్లో నిజాయితీ, కృష్ణంరాజు సొంతం. చేసిన ప్రతి పాత్రకు తనదైన పర్ఫార్మెన్స్ తో న్యాయం చేశారు. విలన్ తో ఫైట్ చేసినా , ఫ్యామిలీలో అనురాగాలు పంచినా సిల్వర్ స్క్రీన్ కు నిండుతనాన్ని తీసుకొచ్చిన నటుడు కృష్ణం రాజు.
కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన 1940 జనవరి 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1966లో “చిలకా గోరింక” సినిమాతో సినీరంగప్రవేశం చేశారు. ఆ తర్వాత నేనంటే నేనే, భలే అబ్బాయిలు, బంగారు తల్లి, మనుషులు మారాలి, మళ్లీ పెళ్ళి లాంటి సినిమాల్లో విలన్ పాత్రలు , కారెక్టర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. కృష్ణంరాజు అనగానే ప్రేక్షకులు గుర్తుపట్టేలా తన నటతో మెప్పించారు. “జీవన తరంగాలు” సినిమాతో హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. కృష్ణంరాజు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. గోపీ కృష్ణ మూవీస్ అనే సంస్థను నెలకొల్పి ఆయన నిర్మాతగా మారారు.
1977 లో కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన “అమరదీపం” కృష్ణంరాజు కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుతోపాటు, నంది అవార్డు అందుకున్నారు. కృష్ణంరాజు నటించిన కటకటాల రుద్రయ్య , మనపూరి పాండవులు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కటకటాల రుద్రయ్య అప్పట్లోనే రూ.75 లక్షల గ్రాస్ ను వసూళ్ళు చేసి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. కృష్ణంరాజు సాంఘిక చిత్రాలే కాకుండా భక్తిరస చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరు కలిసి అత్యధికంగా 17 కి పైగా చిత్రాల్లో నటించారు.
బాపు దర్శకత్వంలో వచ్చిన “భక్త కన్నప్ప” సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి కృష్ణంరాజు కెరీర్ లోనే మరో బెస్ట్ మూవీగా నిలిచింది. కృష్ణంరాజు చివరగా ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ లో స్వామీజీ పాత్రలో నటించారు. ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఉత్తమ నటుడిగా స్థానం సంపాదించుకున్నారు. నటనతోనే కాకుండా రాజకీయాల్లో చేరి ప్రజాసేవలోనూ నిరూపించుకున్నారు . మొత్తంగా ఎన్నో మెమరబుల్ మూవీస్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేశారు కృష్ణంరాజు. 2022 సెప్టెంబర్ 11 న తుదిశ్వాస విడిచారు.