Konda Surekha – Nagarjuna Controversy : ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాగార్జున కుటుంబం, సమంతలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నెటిజన్ల నుంచి ప్రముఖ నటీనటులంతా కొండా సురేఖ పై ఫైర్ అవుతున్నారు. ఇక ఇండస్ట్రీ వర్గాలు అయితే అనవసరంగా రాజకీయాల్లోకి ఎందుకు సినీ నటులను లాగుతున్నారు అంటూ భగ్గుమంటున్నాయి. రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి సంబంధం లేని సినిమా వాళ్ల గురించి ప్రస్తావించి, వాళ్ళ పరువు ప్రతిష్టలను దిగజార్చడం కరెక్ట్ కాదనీ, తమ జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ పై ఆమె చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ సినీ సెలబ్రిటీలందరూ ట్వీట్స్ చేస్తుండగా, నాగార్జున మంత్రి సురేఖపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో నాగార్జునకు చుక్కెదురయింది. నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
నాగ్ పిటిషన్ కేసు వాయిదా…
అక్కినేని కుటుంబం కొండా సురేఖ తమపై చేసిన కామెంట్స్ ను ఖండిస్తూ వరుస ట్వీట్స్ చేసిన తర్వాత ఇండస్ట్రీలోని బిగ్ స్టార్స్ అందరూ వారికి మద్దతుగా నిలుస్తూ కొండ సురేఖపై మండిపడ్డారు. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి కొండా సురేఖ ఇండస్ట్రీ వారి వ్యక్తిగత విషయాలను మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ఫైర్ అవ్వడంతో కొండా సురేఖ దిగివచ్చి సమంతకు క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేసింది. కానీ అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అక్కినేని కుటుంబం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఇక్కడితో వివాదాన్ని వదిలి పెట్టకుండా, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి నాగార్జున ఆమెపై పరుపు నష్టం దావా వేశారు. తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున వేసిన పిటిషన్ సోమవారానికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో ఈ కేసు వాయిదా పడిందని, సోమవారం పిటిషన్ పై మనోరంజన్ కోర్టు విచారించబోతుందని తెలుస్తోంది.
తగ్గేదే లేదు అంటున్న కొండా సురేఖ
అయితే కొండా సురేఖ కేవలం ఈ విషయంలో సమంతకు మాత్రమే క్షమాపణ చెప్పింది. అంతేకానీ ఎక్కడ అక్కినేని కుటుంబం గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె కామెంట్స్ చేసిన మరో వీడియో వైరల్ అవుతుంది. అందులో కొండా సురేఖ హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంది. కానీ తనకు ఆగ్రహం రావడం వల్లే ఈ వాస్తవాలు మాట్లాడాల్సి వచ్చింది అంటూనే ఇప్పటి వరకు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో అసలు నిజాలు ఏంటో బయటకు రాలేదని, టాలీవుడ్ నుంచి అందిన అంతర్గత సమాచారాన్నే తాను చెప్పానంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంది. అంతేకాకుండా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో తగ్గేదే లేదు అంటూ మరోసారి రెచ్చిపోయింది. అయితే సమంతా-చై ఎందుకు విడాకులు తీసుకున్నారో నీకు చెప్పాలా ? అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.