Kollywood Producers Vs Nadigar Sangam..Nasar support hero Danush
కోలీవుడ్ సినీ పరిశ్రమలో గొడవలు చినికిచినికి గాలివానగా మారేలా ఉన్నాయి. నిర్మాతల మండలి ఇటీవల హీరో ధనుష్ ను టార్గెట్ చేసి ఇకపై ధనుష్ చేసే సినిమాలకు సంబంధించి తమిళ నిర్మాతల మండలి అనుమతి తప్పక తీసుకోవాలని..అలాగే ధనుష్ సినిమా మార్కెట్ లో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీకి ఇచ్చుకోవాలని..హీరో ధనుష్ ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వకూడదని కఠిన నిబంధనలు, ఆంక్షలు పట్టింది. దీనితో నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ సంఘం తరపున అధ్యక్షుడిగా ఉన్న నటుడు నాజర్ తమిళ నిర్మాతల మండలిపై ఫైర్ అయ్యారు. తమిళ నిర్మాతల మండలి ధనుష్ ను టార్గెట్ చేయడం భావ్యం కాదు. నిర్మాతల మండలి ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఎవరో కొందరు గిట్టని వ్యక్తులు చేసిన ఆరోపణలను తీసుకుని నిజానిజాలు తెలుసుకోకుండా నిర్మాతల మండలి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఖండిస్తున్నామని నాజర్ అన్నారు.
నిర్మాతల మండలి వెర్సెస్ నడిగర సంఘం
ప్రస్తుతం తమిళనాట నిర్మాతల మండలి వెర్సెస్ నడిగర సంఘం అన్నట్లు తయారయింది. అయితే హీరో ధనుష్ కొంత కాలంగా వివిధ సినిమాలకు అడ్వాన్స్ లు తీసుకుని వాళ్లకు సినిమాలు చేయకపోగా అడ్వాన్సులు కూడా తిరిగి ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నడిగర సంఘంలో సభ్యుడిగా ఉన్న ధనుష్ కు ఇప్పుడు నటీనటుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడు వేలకు పైగా సభ్యులున్న నడిగర సంఘం అధ్యక్షుడిగా నాసర్ ఇటీవలే ఎన్నికయ్యారు. గతంలో ఈ పదవిన హీరో విశాల్ నిర్వహించారు. దివంగత నటుడు ఎంజీ రామచంద్రన్ ఈ నడిగర సంఘాన్ని స్థాపించారు. 1952 సంవత్సరం నుంచి నడిగర సంఘం తమిళనాట సీనియర్, వృద్దాప్య నటులకు అండగా ఉంటూ వస్తోంది. అయితే చాలా కాలంగా నడిగర సంఘం, తమిళ నిర్మాతల మండలి మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పుడు హీరో ధనుష్ విషయంలో ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.