Laapataa Ladies: కొన్ని కొన్ని సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతాయి. ఇంకొన్ని మెసేజ్ ను అందిస్తుంది. మరికొన్ని కథలు ఉంటాయి.. థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా అవి ప్రేక్షకుల మైండ్ లో నుంచి పోకుండా గూడు కట్టుకుపోతాయి. అలాంటి సినిమాలు ప్రస్తుతం చాలా రేర్ గా ఉంటాయి. కొంతమంది వాటి అవార్డు విన్నింగ్ సినిమాలు అని పిలుస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అలాంటి రేర్ పీస్ లలో ఒకటే.. లాపతా లేడీస్ అంటే జాడలేని మహిళలు అని అర్ధం. ఆస్కార్ కు అధికారికంగా ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై ఫోకస్ మరింత ఎక్కువ అయ్యింది. అసలు ఏం సినిమా ఇది .. ? కథ ఏంటి.. ? ఆస్కార్ కు పంపించేంత మ్యాటర్ ఇందులో ఏముంది.. ? అనేది తెలుసుకుందాం.
అమీర్ ఖాన్ కు లాపతా లేడీస్ కు సంబంధం ఏంటి.. ?
స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంట, రవికిషన్, ఛాయా కదమ్, దుర్గేశ్ కుమార్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం లాపతా లేడీస్. ఈ సినిమాను అమీర్ ఖాన్ నిర్మించడం విశేషం. ఇక చిన్న సినిమాగా మార్చి 1 న రిలీజ్ అయిన లాపతా లేడీస్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం హిందీ భాషలో మాత్రమే ఉండడంతో చాలామంది తెలుగువారు ఈ సినిమాను చూడలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆస్కార్ కు ఎంట్రీ ఇవ్వడంతో తెలుగువారు సైతం ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అసలు కథ ఏంటి.. ?
రాజస్థాన్, బీహార్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పేదింటివారు పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి అంటే.. కట్నం ఇవ్వలేక.. గంతకు తగ్గ బొంతలా ఎవరో ఒక పెళ్లి కొడుకును చూస్తారు.. పెళ్లి కూతురు కు అసలు అబ్బాయి ఎవరు .. ? ఏంటి.. ? ఏం చేస్తాడు.. ? వారి ఊరు ఏంటి.. ? ఏది చెప్పరు. పెద్దవాళ్ళు పెళ్లి అనగానే.. ముఖంపై ముసుగువేసుకొని పెళ్లి పీటలు మీద కూర్చోవడం, తాళి కట్టించుకొని.. భర్తతో వెళ్లిపోవడం మాత్రమే అమ్మాయి పని. అలా 2001 సంవత్సరంలో నిర్మల్ ప్రదేశ్ అనే గ్రామంలో ఒకేరోజు చాలామంది పెళ్లిళ్లు జరుగుతాయి. అందులో రెండు జంటలే ఈ కథలో హీరోహీరోయిన్లు. దీపక్ (స్పర్శ్ శ్రీవాస్తవ్) అనే ఒక రైతు ఫూల్ (నితాన్షి గోయల్) ను వివాహమాడి తన ఊరుకు తీసుకెళ్లడానికి బస్సు ఎక్కుతాడు. అదే బస్సులో చాలా జంటలు ఉంటాయి. పెళ్లి కూతుళ్లు అందరూ ముఖానికి ఒకేలాంటి ముసుగుతో ఉంటారు. ఇక అదే బస్సులో జయ (ప్రతిభ రంటా) కూడా తన భర్తతో అత్తారింటికి వెళ్తూ ఉంటుంది. బస్సు కదిలే కొద్దీ.. దీపక్ నిద్రలోకి జారుకుంటాడు. ఇక తమ ఊరు వచ్చి ఇంటికి చేరుకున్నాకా.. ముసుగు తీసి చూస్తే పూల్ ప్లేస్ లో జయ ఉంటుంది. ముఖాలపై ముసుగు ఉండడంతో.. ఎవరు తన భార్య అని పోల్చుకోలేక దీపక్.. పూల్ ను బదులు జయను తీసుకోస్తాడు. ఇక భర్త ముఖాన్ని మాత్రమే చూసిన పూల్.. స్టేషన్ వద్ద ఏడుస్తూ అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంకోపక్క జయ భర్త.. తన భార్య పారిపోయిందని ప్రచారం చేస్తుంటాడు. జయ మాత్రం తన భర్త దీపక్ కాదు అని తెల్సినా అక్కడే ఉండాలని అనుకుంటుంది. మరి స్టేషన్ లో ఉన్న పూల్ పరిస్థితి ఏంటి.. ? జయ ఎందుకు దీపక్ ఇంట్లోనే ఉంటుంది.. ? చివరికి ఈ రెండు జంటల గురించి నిజం తెలుస్తుందా.. ? లేదా.. ? అనేది సినిమా కథ.
సాదా సీదా కథ అయితే కాదు..
ఇండియాలో అత్యంత నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రాలు అంటే..బీహార్ , మధ్యప్రదేశ్ , రాజస్థాన్ అనే చెప్పాలి. ఇక్కడ చదువు ఉండదు.. పేదరికం, పిల్లలను కనడం మాత్రమే తెలుసు.. వారిని పెంచడం తెలియదు. తెలియడం కాదు కానీ, అంత స్తోమత లేదు. అమ్మాయిలకు ఒక వయస్సు వచ్చాకా.. ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు పంపించేయాలా అని చూస్తారు. ఇక అమ్మాయిలు కూడా అంతే. పెద్దలు చెప్పింది చేయడం తప్ప వారికి వేరే గత్యంతరం లేదు. ఇదే విషయాన్నిలాపతా లేడీస్ లో చూపించారు.
అభం శుభం తెలియని ఆడపిల్ల పూల్.. భర్త ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పగానే అతడే తన ప్రపంచం అనుకుంటుంది. అడిగిన వెంటనే నగలు ఇచ్చేస్తుంది. అత్తారింటికి వెళ్లి కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటుంది. కానీ, ఆ ఆడపిల్ల.. భర్త పక్కన లేకుండా ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూపించినప్పుడు.. ఆమెపై కాదు ఆమెను అలా పెంచిన తల్లిదండ్రులపై కోపం వస్తుంది.
ఇంకోపక్క జయ.. ఇష్టం లేని పెళ్లికి తలవంచి భర్తతో వెళ్ళినప్పుడు .. అతడికి తనకన్నా తన నగలపైనే కన్ను ఎక్కువ అని తెలిసి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు.. భర్త నుంచితప్పించుకొనే దారిలా దీపక్ ఇల్లు కనిపిస్తుంది. తన నగలను అమ్మి చదువుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఇండస్ట్రీలో ఎప్పుడు చెప్పే మాటనే.. కథ బావుండలే కానీ, క్యాస్టింగ్ తో పెద్ద పని లేదు. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ అంటే లాపతా లేడీస్ అనే చెప్పాలి.
11 ఏళ్ళ తరువాత కిరణ్ రావు విజయం..
ఇద్దరు ఆడవాళ్ల మానసిక పరిస్థితిని, వారు ఎదుర్కున్న కష్టాలను.. చివరికి వారు చేరుకున్న గమ్యాన్ని డైరెక్టర్ కిరణ్ రావు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది. ఇండియా రోజురోజుకు ఎన్ని కొత్త రంగులు పులుముకుంటున్నా.. ఇంకా ఇలాంటి ప్రదేశాల్లో ఆడవారి పరిస్థితి ఇది అని చెప్పకనే చెప్పుకొచ్చింది. సమాజంలో ఆడవారి కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో కఠిన శిక్షలు, ఆచారాలు.. ఇలాంటివన్నీ నవ్విస్తూనే చురకలు వేసింది.
11 ఏళ్ళ తరువాత కూడా ఆమె తన సత్తా చాటింది కిరణ్ రావు. ఒక్క మాలో చెప్పాలంటే లాపతా లేడీస్ సాదాసీదా కథ కాదు.. అలాగని మరీ మెసేజ్ ఇచ్చేంత మూవీ కాదు. కాకపోతే మనుషులు, మనసులు కలిసినప్పుడే మనువు జరగాలి .. లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి అని చెప్పే ప్రయత్నం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్నో అవార్డులను అందుకుంది. మరి ఆస్కార్ లో కూడా విజయం అందుకుంటుందేమో చూడాలి.