Kiran Abbavaram: రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. మిగతా హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా చేయడానికే కష్టపడుతుంటే.. కిరణ్ మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ షాకుల మీద షాకులు ఇచ్చేవాడు. అయితే అందులో కొన్ని హిట్ అయ్యాయి.. ఇంకొన్ని డిజాస్టర్స్ గా మారాయి.
అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కిరణ్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాడు. అన్నా.. హీరోలా ఉన్నావ్ అన్నా.. సినిమాల్లో నటించు అని వెటకారం చేసేవారు. ఇంకొంతమంది అసలు సినిమాలు చేయడమే మానేయమని ట్రోల్ చేశారు. వీటినేమి పట్టించుకోకుండా కిరణ్.. తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. చివరగా కిరణ్ నటించిన చిత్రం రూల్స్ రంజన్. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే.. కిరణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఒక ఏడాది పాటు.. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపాడు.
సడెన్ గా కిరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి.. ? ప్లాప్ లను తట్టుకోలేకపోయాడా.. ? లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. ? అని చాలామంది ఆరాలు తీయడం మొదలుపెట్టారు కూడా. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా కూడా కిరణ్ సోషల్ మీడియాకు, అభిమానులకు దగ్గరగానే ఉన్నాడు. ఇక ఈ ఏడాదిలో కిరణ్ చాలా పనులే చేశాడు. సొంత ఇల్లు కట్టడం, గృహ ప్రవేశం చేయడం చేశాడు. ఇల్లు కట్టాకా.. ప్రేమించిన అమ్మాయి రహస్య గోరఖ్ ను ఇరు కుటుంబాలను ఒప్పించి పద్దతిగా పెళ్లాడాడు.
ఇక కిరణ్ చెప్పినట్లే ఏడాది తరువాత ఒక కొత్త సినిమాను అభిమానుల ముందుకు తీసుకురానున్నాడు. ఆ సినిమానే క. సుజిత్ మరియు సందీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటి నుంచి క సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన కిరణ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కిరణ్.. తాను ఎందుకు ఒక ఏడాది గ్యాప్ తీసుకున్నాడో తెలిపాడు. ” వరుస సినిమాలు చేయడం వలన మేకోవర్ మీద దృష్టి పెట్టలేకపోయాను. ప్రతి సినిమాలో ఒకేలా కనిపించానని అనిపించింది. అంతేకాకుండా మంచి కథలను ఎంపిక చేసుకోలేకపోయాను. వరుస సినిమాలు చేశాను.. అందులో కొన్ని తప్పులు కూడా చేశాను. వాటిని సరిద్దిదుకోవడానికే సమయం తీసుకున్నాను. ఏడాది గ్యాప్ తీసుకున్నాకే ఒక సినిమా చేయాలనుకున్నాను.
వెనుక బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాను. అందుకే నేను చేయాలనుకున్నవి చేయలేకపోయా. ఇప్పుడు క సినిమా.. ఏడాది గ్యాప్ తరువాత వస్తుందే. దీని కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న క సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.