Kiara-Sidharth: బాలీవుడ్ ప్రేమ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈనెల 7న పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు ఇతరుల కోసం త్వరలోనే ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు, నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక వారిద్దరికి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పెళ్లి అనంతరం సిద్ధార్థ్ తన భార్య కియారాను తీసుకొని తొలిసారి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నాడు. కొత్తకోడలుకు కుటుంబ సభ్యులు బ్యాండు మేళాతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిద్దార్థ్, కియారా అదిరిపోయే స్టెప్పులేశారు. నవదంపతులు మొదటిసారి అడుగుపెట్టడంతో వారి ఇంట్లో సంతోషం వెల్లివిరిస్తుంది.