Kerala Director Ranjith | మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు రోజు రోజుకూ తీవ్ర మవుతున్నాయి. ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలపై ఈ ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనం రేపుతోంది. దీంతో గతంలో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి మహిళ నటులతోపాటు, జూనియర్ పురుష ఆర్టిస్టులు కూడా ధైర్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక పురుష నటుడు ప్రముఖ మలయాళ దర్శకుడిపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
దర్శకుడు రంజిత్ కు మలయాళ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుంది. అలాంటి వ్యక్తి తనను సినిమా అవకాశం కోసం చాలా రోజులపాటు తిప్పుకున్నాడని చెబుతూ.. ఒక రోజు సినిమా ప్రొమోషన్ ఫంక్షన్ సమయంలో తనను పిలిచాడని చెప్పాడు. అక్కడికి వెళ్లగా దర్శకుడు రంజిత్ మద్యం సేవించి ఉన్నాడని తెలిపాడు. ఫంక్షన్ జరుగుతున్న ప్రదేశంలో ఒక గదిలోకి తనని తీసుకెళ్లి బట్టలు విప్పమన్నాడని వివరించాడు. అయితే రంజిత్ చెప్పినట్లు తాను వినకపోతే.. మద్యం మత్తులో తూగుతూ చెప్పింది చేయమని గట్టిగా అరిచాడని.. దీంతో భయపడి తాను బట్టలు విప్పేశానని అన్నాడు.
ఆ తరువాత తాను నగ్నంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసి.. ఎవరో మహిళతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపాడు. ఆ మహిళకు తన నగ్న ఫొటోలు చూపించి.. బాగున్నాయా అని కూడా అడిగినట్లు తెలిపాడు. అయితే తన ఫొటోలు ఎవరికి పంపారని ప్రశ్నించగా.. దర్శకుడు రంజిత్ బదులిస్తూ.. ‘రేవతి మేడమ్ కి పంపాను.’ అని చెపినట్లు వివరించాడు. ఈ ఘటన 2012లో జరిగిందని అన్నాడు. అయితే ఆ నటుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేరళ సినిమా దర్శకుడు రంజిత్ 2009లో పాలేరి మాణిక్యం సినిమా ఆడిషన్స్ సమయంలో తనను లైంగికంగా వేధించాడని ఇటీవలే ఓ బెంగాలీ నటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరో నటుడు కూడా ఆరోపణలు చేయడంతో దర్శకుడు రంజిత్ సమస్యలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మలయాళ సినిమాలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేరళ చల చిత్ర అకాడమీకి చైర్మన్ పదవిలో దర్శకుడు రంజిత్ ఉన్నారు. అయితే తనపై బెంగాలీ నటి చేసిన ఆరోపణలు అబద్ధమని దర్శకుడు రంజిత్ మండిపడ్డారు.
తాజాగా ఓ పురుష నటుడు చేసిన ఆరోపణలపై దర్శకుడు రంజిత్, నటి రేవతి ఇంకా స్పందించలేదు. మరోవైపు మలయాళ ప్రముఖ నటులలో సీనియర్ నటులు ముకేశ్, జయసూర్య పై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. మలయాళ సినిమాలలో సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ వివాదాల కారణంగా మలయాళ సినీ సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఆ సంఘంలోని సభ్యులందరూ రాజీనామా చేశారు. ఇటీవల జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లో మహిళలపై మలయాళ సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తేలడంతో ఈ వివాదం మొదలైంది.
ఈ వివాదంపై వుమెన్ ఇన్ కలెక్టివ్ సినిమా సంఘం సభ్యురాలు రేవతి స్పందిస్తూ.. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించారు. అయితే దర్శకుడు రంజిత్ కేసులో ఆమె పేరు కూడా రావడంతో వివాదంలో కొత్త ట్విస్టు వచ్చింది.
Also Read: ఫారిన్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..