Keerthi Sagar : టాలీవుడ్ ఫేమస్ రైటర్ అనుమానాస్పద మృతి..
Keerthi Sagar : డబ్బు, పేరు, గుర్తింపు అనేవి ఒకసారి మనిషి ప్రాణాలను కాపాడలేకపోతాయి. ఎంత డబ్బు సంపాదించినా కూడా కొంతమంది జీవితాల్లో సంతోషం అనేది ఉండదు. కేవలం వారు డిప్రెషన్తోనే సావాసం చేస్తుంటారు. దాని కారణంగా ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఇలాంటి ఆత్మహత్యలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా మరో సీనియర్ రైటర్ కూడా అనుమానస్పద రీతిలో మృతిచెందాడు.
టాలీవుడ్లో స్టోరీ రైటర్గా మంచి పేరు తెచ్చుకున్న కీర్తీ సాగర్ (50) తాజాగా అనుమానస్పద రీతిలో మృతిచెందాడు. తెలుగులో ఎన్నో వందల సినిమాలు.. ఆయన రాసిన కథతో తెరకెక్కినవే. కానీ గత కొంతకాలంగా రైటర్స్ విషయంలో పరిశ్రమలో పోటీ పెరిగిపోయింది. దీంతో సీనియర్ అయినా కూడా కీర్తీ సాగర్కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. గత కొన్నేళ్లలో అయితే ఒక్క అవకాశం కూడా లేకపోవడంతో ఆయన మానసిక ఒత్తిడికి గురయినట్టు తెలుస్తోంది.
ఛాన్సులు లేక, మానసిక ఒత్తిడికి గురవ్వడం వల్లే కీర్తీ సాగర్ ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కానీ కీర్తీ సాగర్ మరణ వార్త తెలిసిన తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు ఎవరూ మృతదేహాన్ని తీసుకోవడానికి రాలేదనే విషయం అందరినీ షాక్కు గురిచేసింది. కర్నూలు జిల్లాకు చెందిన కీర్తి సాగర్ చాలా కాలం క్రితమే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. షేక్పేట్ పరిధిలో నివసించడం మొదలుపెట్టాడు. ఎన్నో హిట్ సినిమాలకు కథలు అందించిన రికార్డ్ కీర్తీ సాగర్ సొంతం.
గత కొంతకాలంగా ఛాన్సులు లేక డిప్రెషన్లో ఉన్న కీర్తీ సాగర్.. తాజాగా తను ఉండే ఇంటిపై విగతజీవిగా కనిపించాడు. ముందుగా తనను చూసిన తన స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కీర్తీ సాగర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కీర్తీ సాగర్ డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.