Kantara Movie Court Case:- గత ఏడాది దక్షిణాది నుంచి విడుదలై పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రాల్లో కాంతార ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ సినిమాను డైరెక్ట్ చేశారు. కెజియఫ్ మేకర్స్ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.16 కోట్ల బడ్జెట్తో రూపొందిన చిత్రం ముందు కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అనువాదమై బ్లాక్ బస్టర్ అయ్యింది. దాదాపు రూ.450 కోట్ల మేరకు వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయాల్లో వరాహ రూపం సాంగ్ ఒకటి.
అయితే వరాహ రూపం సాంగ్ కారణంగా కాంతార సినిమా వివాదాల్లో చిక్కుకొంది. ఎందుకంటే ఆ పాటను కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన తాయికుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్రాండ్ ఆరోపణలు చేయటంతో పాటు లీగల్ యాక్షన్కు సిద్ధమై కోర్టు మెట్లు ఎక్కింది. విచారణ చేసిన కోర్టు కాంతార మేకర్స్కు షాక్ ఇచ్చింది. సినిమా యూనిట్ పాటను తాయికుడం బ్రిడ్జ్ నుంచి కాపీ కొట్టారని కోర్టు వ్యాఖ్యలు చేసింది. వరాహ రూపం సాంగ్ను థియేటర్స్తో పాటు డిజిటల్ మాధ్యమాల్లో ఉపయోగించరాదంటూ నిషేధాన్ని విధించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మే 4లోగా అందజేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అయితే గతంలో సినిమా నుంచి పాటను తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చిన విషయం విదితమే.
ప్రస్తుతం కాంతార మేకర్స్ ఈ సినిమాకు ప్రీమేక్ వెర్షన్గా కాంతార 2ను రూపొందించే పనిలో ఉన్నారు. రిషబ్ శెట్టి అండ్ టీమ్ రైటింగ్ వర్క్పై పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇందులో రజినీకాంత్ నటిస్తారనే టాక్ కూడా రీసెంట్గా చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.