దక్షిణాది సినిమా గోల్డెన్ ఎరాలో ఉంది. కరోనా తర్వాత బాక్సాఫీస్ దగ్గర రాణించటానికి బాలీవుడ్ సినిమాలు అపసోపాలు పడుతుంటే, సౌత్ మూవీస్ మాత్రం పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు భాషా పరమైన హద్దులు చెరిగిపోతున్నాయి. ఈ కోవలో రీసెంట్గా సెన్సేషనల్ హిట్ సాధించిన చిత్రం ‘కాంతార’. కర్ణాటకు సంస్కృతి, సంప్రదాయాలను ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించారు. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. కె.జి.యఫ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీని రూపొందించిన హోంబలే ఫిలింస్ కాంతార చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
రూ.16 కోట్లతో నిర్మించిన కాంతార విడుదలైన అన్నీ భాషల్లో సూపర్ డూపర్ర హిట్ అయ్యింది. కలెక్షన్స్ పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా కాంతార ఖాతాలో మరో రికార్డ్ చేరింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు కాంతార సినిమా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కర్ణాటకలో రూ.168.50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.60 కోట్లు, తమిళనాడు రూ.12.70 కోట్లు, కేరళ రూ. 19.20 కోట్లు, ఓవర్ సీస్లో రూ.44.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.96 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా చూస్తే రూ. 400.90 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ను కాంతార వసూలు చేసింది.