JD Chakravarthy : రిలేషన్షిప్, విషప్రయోగం లాంటి విషయాలపై జేడీ స్పందన..
కొంతమంది నటీనటులు సినిమాల్లో యాక్టివ్గా లేకపోయినా.. కాంట్రవర్సీల్లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఒకవేళ వారు కాంట్రవర్సీలు స్టార్ట్ చేయకపోయినా.. ఏదో ఒక విధంగా అవే వారిని వచ్చి చేరుతాయి. ప్రస్తుతం సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి పరిస్థితి కూడా అలాగే ఉంది. తాజాగా జేడీ చక్రవర్తిపై వస్తున్న రూమర్స్కు స్వయంగా తానే సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా తన మీద విషప్రయోగం జరిగిందనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
ఒకప్పుడు హీరోగా జేడీ చక్రవర్తికి ఉన్న క్రేజే వేరే. ముఖ్యంగా రావు గోపాల్ వర్మ సినిమాల వల్ల జేడీ చక్రవర్తికి విపరీతమైన క్రేజ్ లభించింది. ఆపై మెల్లగా తనకు అవకాశాలు తగ్గిపోయాయి. వచ్చిన సినిమా అవకాశాలు కూడా ఫ్లాప్ అవ్వడం ప్రారంభమయ్యింది. దీంతో కొన్నాళ్ల పాటు ఈ హీరో అసలు స్క్రీన్పై కనిపించలేదు. అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాలో ఏదో ఒక పాత్రతో పలకరించిన.. అవి తనకు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి.
తాజాగా యాంకర్ విష్ణుప్రియా.. జేడీ చక్రవర్తి అంటే తనకు ఇష్టమని, ప్రేమిస్తున్నానని, కుదిరితే పెళ్లి కూడా చేసుకుంటానని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అయినా కూడా ఇప్పటివరకు ఈ విషయంపై జేడీ చక్రవర్తి స్పందించలేదు. తాజాగా ‘దయా’ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్న జేడీ చక్రవర్తి.. దీని ప్రమోషన్స్ సమయంలో ఈ విషయంపై స్పందించడానికి ముందుకొచ్చాడు. విష్ణుప్రియాతో తను రిలేషన్షిప్లో లేనని క్లారిటీ ఇచ్చేశాడు. దయా సిరీస్లో వారిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు గమనార్హం.
రిలేషన్షిప్తో పాటు ఒకప్పుడు తనపై జరిగిన విషప్రయోగం గురించి కూడా జేడీ బయటపెట్టాడు. తాను ఒకప్పుడు రోజూ ఒక కషాయం తాగేవాడినని చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆ కషాయాన్ని తన నిర్మాతకు ఇవ్వగా.. అతని ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని అన్నాడు. అతడిని ఆసుపత్రిలో చేర్చగా.. కషాయంలో విషయం ఉందని తేలింది. ఎనిమిది నెలలుగా తనపై స్లో పాయిజన్ ప్రయోగం జరుగుతుందని అప్పుడే తెలుసుకున్నానని జేడీ బయటపెట్టాడు. దాని వల్ల తనకు పలు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయని చెప్పి అందరినీ షాక్కు గురిచేశాడు.