Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. గత కొంతకాలంగా అల్లు అర్జున్ చేస్తున్న పనులు మెగా ఫ్యాన్స్ కు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని అందరికి తెల్సిందే. అసలు ఎందుకు బన్నీ ఇదంతా చేస్తున్నాడు. అటెన్షన్ కోసమేనా.. ? లేక తన దారి తనది.. ? మెగా ఫ్యామిలీతో తనకు సంబంధం లేదని నిరూపించాలని చూస్తున్నాడా.. ? అనేది అభిమానులకు అర్ధం కావడం లేదు. అసలు ఇదంతా ఎక్కడ మొదలయ్యింది అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి మేనల్లుడుగా అల్లు అర్జున్.. గంగోత్రి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
బన్నీకి ఒక స్టార్ డమ్ వచ్చేవరకు.. మెగా ఫ్యామిలీ గురించి చెప్పడానికి కానీ, వారి వలనే ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి కానీ, ఎప్పుడు మొహమాటపడలేదు. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ కు స్టార్ డమ్ వచ్చిందో.. కొద్దికొద్దిగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పడం తగ్గించాడు. మొదటి నుంచి మెగా- అల్లు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయని వచ్చే వార్తలను మెగాస్టార్, అల్లు అరవింద్ ఖండిస్తూ వచ్చారు కానీ, ఏరోజు కూడా బన్నీ ఈ విషయాల గురించి మాట్లాడింది లేదు. ఏ ముహూర్తాన.. మెగా హీరోల గురించి చెప్పను బ్రదర్ అన్నాడో అప్పటినుంచి మెగా- అల్లు ఫ్యాన్స్ వేరు అయ్యారు. అలా మొదలైన ఈ విభేదాలు.. అంతకంతకుపెరుగుతూ వచ్చాయి.
జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ఉన్న అల్లు అర్జున్.. ఈ ఏడాది ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చాడు. దానికి కారణాలు ఏమైనా కానీ, ఆ సమయంలో బన్నీ అలా చేయడం మాత్రం ఎవరికి నచ్చలేదు. రెండు రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని.. ఫ్రెండ్ కోసం సొంత మామ పార్టీకి కాకుండా వేరే పార్టీకిబన్నీ సపోర్ట్ చేయడం అనేది ఎవరికి మింగుడుపడలేదు. అయితే బన్నీ అలా చేయడానికి కారణం కేవలం అటెన్షన్ కోసమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లేరోజునే రామ్ చరణ్ పిఠాపురం ప్రచారానికి వెళ్ళాడు.
ఇక చరణ్.. పిఠాపురం వస్తున్నాడు అని తెలిసి అభిమానులు అందరూ సంబురాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియా మొత్తం రామ్ చరణ్ గురించే మాట్లాడుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే బన్నీ.. ఇలాంటి పర్యటన చేసి.. ప్రజల అటెన్షన్ మొత్తం గ్రాబ్ చేసుకున్నాడు. తన పేరును సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మార్చుకున్నాడు. అప్పటినుంచి.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేవరకు కూడా సోషల్ మీడియాలో ఎక్కడో ఒకచోట బన్నీ పేరు వినిపిస్తూనే ఉంది. మెగా ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు.. బన్నీ ఫ్యాన్స్ కొంతమంది సపోర్ట్ గా నిలబడగా.. మరికొంతమంది తప్పును తప్పే అని చెప్పుకొచ్చారు.
ఇక కాలం దేన్నీ అయినా మరిపిస్తుంది అన్నట్లు.. కొద్దీకొద్దిగా ఈ విషయాన్నీ నెటిజన్స్ మర్చిపోతున్నారు. ఈ సమయంలోనే అగ్నికి ఆజ్యం పోసినట్లు మరోసారి అల్లు అర్జున్.. ఆ టాపిక్ తీసుకొచ్చి ఫ్యాన్స్ ను రెచ్చగొట్టాడు. నిన్న జరిగిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో డిబేట్ లు జరుగుతున్నాయి. నా ఫ్రెండ్స్ కోసం నేనొస్తా.. నా మనసుకు నచ్చితే నేనొస్తా అని చెప్పి .. మానిన గాయాన్ని మళ్లీ రేపాడు. ఇక ఇప్పుడు ఎందుకు మర్చిపోయినదాన్ని రేపుతున్నాడు అంటే.. ఈరోజు మెగాస్టార్ బర్త్ డే. అందరి అటెన్షన్ మెగా ఫ్యామిలీ మీద ఉంటుంది. ఈ సమయంలో మళ్లీ ట్రెండ్ లో నిలవాలంటే.. బన్నీ ఈ పని చేయకతప్పదు కదా అని మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
అసలు ఆ ఈవెంట్ లో బన్నీ ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమే లేదు. కానీ, కావాలనే అతను ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో అందరు తన గురించి మాట్లాడేలా చేశాడు. ఈ విషయం అర్ధమైన కొంతమంది బన్నీ కేవలం అటెన్షన్ కోసమే రెచ్చగొడుతున్నాడు అని బహిరంగంగా చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకోపక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెర్షన్ వేరేలా ఉంది. ఆ రాజకీయ పర్యటన తరువాత ఇప్పటివరకు దాని గురించి మాట్లాడలేదు కాబట్టి.. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. దాంట్లో తప్పేముందని చెప్పుకొస్తున్నారు.
ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై ఇండస్ట్రీ మొత్తం ఎన్నో అంచనాలను పెట్టుకుంది. నిజం చెప్పాలంటే అల్లు ఫ్యాన్స్ లో సగానికి పైగా మెగా ఫ్యాన్సే ఉన్నారు. ఇప్పుడు ఈ గొడవల వలన ఎవరికి వారు సపరేట్ అయ్యారు. దీంతో పుష్ప 2 పై నెగెటివ్ టాక్ మొదలయ్యింది. సినిమా బావుండి.. ప్రేక్షకులకు నచ్చితే ఓకే కానీ, ఏదైనా అటుఇటు అయ్యి పుష్ప 2 కనుక మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంటే.. బన్నీపై వచ్చే విమర్శలను ఎవరు ఆపలేరు. మరి అల్లు అర్జున్ .. పుష్ప 2 తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలంటే డిసెంబర్ 6 వరకు వేచి చూడాల్సిందే.