Dev Mohan : అతడెవరో ఎవరికీ తెలియదు. తెలుగువాడు కాదు. కానీ టాలీవుడ్ లో ఎంట్రీలోనే టాప్ హీరోయిన్ పక్కన నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. తెలుగులో రెండో సినిమాలో మరో స్టార్ భామతో జోడి కట్టే అవకాశాన్ని అందుకున్నాడు. అతడే శాకుంతలంలో నటించిన హీరో . సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. సినిమాపై సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి .
శాకుంతలం ప్రమోషన్ లో సామ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే ఈ సినిమాకు సమంత డబ్బింగ్ చెప్పింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటోంది. వరుసగా ఇంటర్వూలు ఇస్తూ శాకుంతలంకు హైప్ క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో ఈ సినిమాలో హీరోను ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. అతడు ఎవరో తెలుసా.. మలయాళీ నటుడు దేవ్ మోహన్.
సౌతిండియా టాప్ హీరోయిన్ సమంతతో జోడి కట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దేవ్ మోహన్.. రెండో సినిమా మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాతో చేస్తున్నాడు. రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రెయిన్బో మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా దేవ్ ఇద్దరు టాప్ హీరోయిన్ల సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.
అసలు ఎవరీ దేవ్ మోహన్?
దేవ్ మోహన్ కేరళలోని త్రిశ్శూర్లో 1992 సెప్టెంబర్ 18న జన్మించాడు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. బెంగళూరులోని ఓ కార్పొరేట్ కంపెనీలో కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశాడు. అక్కడ రోజూ జిమ్కు వెళ్లేవాడు. అక్కడే దేవ్కు ఓ మోడల్ పరిచయమయ్యాడు. మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని దేవ్కు సలహా ఇచ్చాడు. అలా దేవ్ మోహన్ మోడల్ రంగంలో అడుగుపెట్టాడు. 2016లో ముంబైలో నిర్వహించిన పోటీల్లో ఫైనలిస్ట్గా ఎంపికయ్యాడు. ఉద్యోగం చేస్తూనే వీక్ ఎండ్ లో ఫ్యాషన్ షోల్లో పాల్గొనేవాడు.
తొలుత దేవ్ మోహన్ కు నటన అంటే ఆసక్తి లేదంట. అనుకోకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టానని చెబుతున్నాడు. ఓ నిర్మాణ సంస్థ కొత్త హీరోకు అడిషన్ నిర్వహిస్తుందని వెళ్లమని ఓ మిత్రుడి చెప్పాడంట. దీంతో అతని మాటను కాదనలేక దేవ్ ఆ ఆడిషన్కు వెళ్లాడంట. అలా హీరో పాత్రకు సెలక్ట్ అయ్యాడు. తన తొలి సినిమా ‘సూఫియం సుజాతయుం’ ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీలో దేవ్ నటనకు మంచి పేరొచ్చింది. ఈ మూవీలో సూఫీ గురువుగా నటించాడు. నాట్యం, అరబిక్, ధ్యానం… ఇలా ఎన్నో నేర్చుకున్నాడు. సూఫియుం సుజాతయుం చూసిన నిర్మాత గుణ నీలిమ శాకుంతలంలో దుష్యంతుడి పాత్రకు ఎంపిక చేశారని దేవ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
నటుడిగా కెరీర్ ప్రారంభంలోనే ఇతిహాస నేపథ్య చిత్రంలో నటించడం, అదీ సమంతతో కలిసి తెరను పంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు దేవ్. సామ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. నటనలో ఎలాంటి సందేహాలు వచ్చినా అడుగుతానని షూటింగ్ ప్రారంభించిన తొలిరోజే సమంతకు కోరాడట.
దేవ్ నటించిన తొలి సినిమా సూఫియుం సుజాతయుం 2020లో విడుదలైంది. ఆ తర్వాత హోమ్ చిత్రంలో అతిథి పాత్ర పోషించాడు. అది 2021లో ప్రేక్షకుల ముందుకువచ్చింది. దేవ్ నటించిన మూడో చిత్రం పాత్రాండు 2022లో రిలీజ్ అయింది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రెయిన్బోలోనూ అవకాశం దక్కించుకున్నాడు. కొత్త దర్శకుడు శాంతరూబన్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదీ దేవ్ మోహన్ కథ..!