Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదిరే పంచ్ లతో అతని స్కిట్స్ ఎప్పుడు నవ్వు తెప్పిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం జబర్దస్త్ ను వదిలి సినిమాల్లో బిజీగా మారిన హైపర్ ఆది ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాడు. జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం హైపర్ ఆది ఏ రేంజ్ లో కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ దగ్గరనుంచి రోజా వరకు ఒక్కరిని కూడా వదలకుండా తన పంచ్ లతో ఏకిపారేశాడు.
ఇక పవన్ కళ్యాణ్ గెలవడానికి హైపర్ ఆది ప్రచారం ఎంతో ఉపయోగపడిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక పవన్ గెలిచాక కూడా ఆది.. వైసీపీని వదిలిపెట్టడం లేదు. ఈసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లను గెలిచిన విషయం విదితమే. ఇక ఆ నెంబర్ పట్టుకొని హైపర్ ఆది సందు దొరికినప్పుడల్లా దానిమీద కామెడీ చేస్తున్నాడు.
తాజాగా కమిటీ కుర్రాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి హైపర్ ఆది ఈ 11 నెంబర్ గురించి మాట్లాడి నవ్వులు పూయించాడు. నిహారిక నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ ” నిహారిక.. వాళ్ల బాబాయ్ గారిలాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు ట్రెండ్ సెట్ చేసే టైప్. 11 మంది హీరోలను పెట్టి సినిమా తీసింది అంటే ట్రెండ్ సెట్ చేసినట్లే.
11 మంది హీరోలు అంటే.. రీసెంట్ గా 11 మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చినట్టు.. ఈ 11 మంది హీరోలు మా నిహారికకు విజయం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి. కానీ, ఈ సినిమా తరువాత 11 అంటే ఈ సినిమానే గుర్తొస్తుంది. అది అయితే కచ్చితంగా చెప్పుకొస్తాను” అని తెలిపాడు. ప్రస్తుతం ఆది వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో నిహారిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.