Guntur Kaaram Review: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో ‘గుంటూరు కారం’ తెరకెక్కింది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జయరాం, జగపతి బాబు, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నాగవంశీ, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్గా ఉన్నారు. ఇక త్రివిక్రమ్ – మహేశ్ కాంబోలో ఈ చిత్రం మూడవది. పన్నెండేళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇంత బజ్ క్రియేట్ చేస్తూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం..
కథ
జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్యనారాయణ (ప్రకాశ్ రాజ్) కూతురు వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతుంది. అయితే అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటా మధు (రవిశంకర్) తనకు మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతాడు. కానీ, తన కుమార్తెను మంత్రిని చేస్తానని పార్టీ అధినేత చెప్తాడు. అలాంటి సమయంలోనే కాటా మధు వారిని బెదిరిస్తాడు. మొదటి భర్త రాయల్ సత్యం (జయరామ్)కు విడాకులు ఇచ్చి వసుంధర రెండోపెళ్లి చేసుకుందని.. మొదటి భర్త ద్వారా కలిగిన సంతానాన్ని వదిలేసి వచ్చిందనే విషయాల్ని బయట పెడతానంటాడు.
కాగా వెంకట రమణ (మహేష్ బాబు) గుంటూరు మిర్చి యార్డులో ఉంటాడు. పదేళ్ల వయసులోనే అమ్మ (రమ్యకృష్ణ) వదిలేసి వెళ్లడంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు. పాతికేళ్ల తర్వాత తాత (ప్రకాష్ రాజ్) నుంచి రమణ (మహేశ్)కు పిలుపు వస్తుంది. కూతురు రాజకీయ జీవితానికి అడ్డు రాకుండా ఉండాలని.. తల్లితో తనకు ఎటువంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం చేయమని రమణను.. తాతయ్య (ప్రకాశ్ రాజ్) కోరతాడు. కానీ అమ్మ మీద కోపంతో రమణ సంతకం చేయడు. అసలు వసుంధర (రమ్యకృష్ణ).. రమణ (మహేశ్) తండ్రికి ఎందుకు విడాకులు ఇచ్చింది? పాతికేళ్లు కొడుకును కనీసం ఎందుకు చూడలేదు? చివరకు ఏమైంది? మధ్యలో అమ్ము (శ్రీలీల)తో రమణ కథేంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్
సినిమాలో ముఖ్యంగా యాక్షన్ సీన్స్, కామెడీ, రొమాన్స్ ఎలా ఉందో చూద్దాం అని చాలామంది అనుకుంటారు. కానీ త్రివిక్రమ్ సినిమా అనగానే ఆయన మాటలు, పవర్ ఫుల్ డైలాగ్స్ కోసం చూస్తారు. అలా మాటలతో మాయ చేయడం ఆయన స్పెషాలిటీ కూడా. అతి సాధారణమైన సన్నివేశాన్ని తన మార్క్ సంభాషణలతో అద్భుతంగా మార్చగల నేర్పు ఒక్క త్రివిక్రమ్కు మాత్రమే సాధ్యం. అయితే ఈ సినిమా మొదటి నుంచి ఓ ఫ్లోలో వెళుతుంది. కథపరంగా చూసుకుంటే చాలా చాలా సింపుల్.. కానీ త్రివిక్రమ్ స్క్రీన్ప్లేతో మాయ చేయాలని చూశాడు. ఎప్పుడూ ఎమోషనల్ సన్నివేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే త్రివిక్రమ్ ఈసారి యాక్షన్ సీన్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మహేశ్ బాబు కామెడీతోనే అయిపోతుంది. రెండు మూడు యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.
చాలా వరకు అభిమానులు కోరుకునే సన్నివేశాలతోనే ఈ యాక్షన్ సీన్స్ను నింపేశాడు. సెకండాఫ్ కాస్త బెటర్గా రాసుకున్నాడు. ముఖ్యంగా ఇందులో ‘కుర్చీ మడత పెట్టి…’, ‘నక్కిలీసు గొలుసు’ పాటల్లో మహేష్ బాబు డ్యాన్స్ ఇరగ్గొట్టేశారనే చెప్పాలి. మహేశ్ ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గుంటూరు కారం సినిమాను కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్, శ్రీలీల మధ్య వచ్చే ట్రాక్ అంతా ఆకట్టుకుంటుంది. రమ్యకృష్ణ పాత్ర, ఆమె నటన హుందాగా ఉంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. మహేష్ బాబును మాత్రమే చూడాలి అనుకుంటే గుంటూరు కారం అదిరిపోయింది.
మైనస్ పాయింట్స్
‘గుంటూరు కారం’లో త్రివిక్రమ్ మార్క్ కనిపించడం లేదనే వెలితి ప్రేక్షకులకు కలుగుతుంది. కథ, కథనాల్లో కొత్తదనం లేదు. కథలో బలం లేకపోవడంతో త్రివిక్రమ్ పెన్ కూడా పెద్దగా కదల్లేదు. సంభాషణల్లో ఆయన మార్క్ కనిపించలేదు. రమ్యకృష్ణ, మహేశ్ మధ్య బాండింగ్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. ప్రకాశ్రాజ్, వెన్నెల కిశోర్ పాత్రల్లో కొత్తదనమేమీ లేదు. జగపతిబాబు, మురళీశర్మ, రావు రమేశ్, సునీల్ ఇలా చాలా మంది నటులు కనిపిస్తారు కానీ, ఏ పాత్రలోనూ బలం కనిపించదు. ఇంటర్వెల్ వరకు కూడా కథలో పెద్దగా వేగం ఉండదు. ఒక్క సీనులోనూ ఎమోషన్ వర్కవుట్ కాలేదు. చివరిగా గుంటూరు కారం.. ఘాటున్నా రుచి లేదు.
గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!
.
.