Gaddar : గద్దర్ కాలికి గజ్జెకట్టి ప్రజాక్షేత్రంలో పాటల పాడి జనాన్ని చైతన్యం చేశారు. అదేవిధంగా వెండితెరపైనా మెరిశారు. ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. కొన్ని సినిమాల్లో ఆ పాటలను తానే పాడారు. మరికొన్ని సినిమాల్లో పాడటంతోపాటు నటించారు. ఇలా సినిమా రంగంపైనా ప్రజాగాయకుడు తనదైన ముద్ర వేశారు. మా భూమి సినిమాలో “బండెనక బండి కట్టి..” రంగులకల చిత్రంలో “భద్రం కొడుకో..” అడవి బిడ్డల మూవీలో “ఆగదు ఆగదు… ఈ ఆకలి పోరు ఆగదు..” దండకారణ్యంలో “భారతదేశం భాగ్యసీమరా.. సకల సంపదలకి కొదువలేదురా..” ఈ పాటలు గద్దర్ కు ఎంతో పేరు తెచ్చాయి.
ఓరేయ్ రిక్షా సినిమాలోని “మల్లెతీగకు పందిరివోలె మసక సీకటిలో వెన్నెలవోలె.. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..” జై బోలో తెలంగాణ చిత్రంలో “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా ..” ఇలా ఎన్నో పాటలు ఆయన కీర్తిని మరింత పెంచాయి. ప్రజా సమస్యలు, ఉద్యమాలు, సామాన్యుడి పోరాటం ఇలాంటి అంశాలతో తెరకెక్కిన సినిమాల్లో గద్దర్ పాట తప్పక ఉండేది. బి.నర్సింగరావు, ఆర్.నారాయణమూర్తి, ఎన్.శంకర్ లాంటి దర్శకుల సినిమాల్లో గద్దర్ పాటలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశాయి.
ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఒరేయ్ రిక్షా సినిమాలోని పాటల్నీ గద్దర్ రాశారు. ఆ సినిమాలోని “మల్లెతీగకు పందిరివోలె..” పాటకు ఉత్తమ గేయ రచయితగా గద్దర్కు, ఉత్తమ సింగర్ గా వందేమాతరం శ్రీనివాస్కు నంది అవార్డు లభించింది. జై బోలో తెలంగాణలోని “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా..” పాటకి ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు వచ్చింది. కానీ విప్లవ ఉద్యమంలో ఉన్నవారు ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలకు దూరంగా ఉండాలనే నియమానికి గద్దర్ కట్టుబడ్డారు. అందుకే ఆ అవార్డులను తిరస్కరించారు.
చివరిగా ఉక్కు సత్యాగ్రహం సినిమాలో గద్దర్ నటించారు. ఈ సినిమాకు పాటలు కూడా రాశారు. గద్దర్ ఇకలేరని తెలిసి తెలుగు చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.