K.Viswanath: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూయడంతో సినీలోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్గారు కున్నుమూయడం బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఒక సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడని కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అత్యంత ఆప్తులు, పితృసమానులు, గురుతుల్యులు కళా తపస్వి కె.విశ్వనాథ్గారు లేరనే మాట తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని.. ఆర్ట్ ఫిల్మ్స్ను జనరంజకంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని వెల్లడించారు. నేటి యువ దర్శకులకు ఆయన సినిమాలు ఒక గ్రంధాలయమని.. తమ లాంటి నటులకు ఆయన ఒక ఎన్సైక్లోపీడియా అని తెలిపారు. అటువంటి గొప్ప దర్శకుడి వద్ద పనిచేయడం తన అదృష్టమని చెప్పారు.
‘‘ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తం రుణపడి ఉంటాము సర్’’ అని దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
కళా తపస్వి కె.విశ్వనాథ్ మృతిపట్ల టీడీపీ నేత నారా లోకేష్ సంతాపం తెలియజేశారు. ఆయన కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన దిగ్దర్శకుడు దివంగతులవడం బాధాకరం అని తెలిపారు.
లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్గారు లేరంటే షాకింగ్గా ఉందని నటుడు వెంకటేష్ అన్నారు. ఈ జనరేషన్ మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలు కూడా ఆయన సినిమాలను గుర్తు పెట్టుకుంటాయని అన్నారు. స్వర్ణకమలం సినిమా సందర్భంగా ఉన్నో విషయాలు నేర్పారు అని చెప్పారు. వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.