K.Viswanath: డైనమిక్ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన నివాసం నుంచి పంజాగుట్టలోని స్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. సినీ ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్ని విశ్వనాథ్కు అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.
కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళాతపస్వి మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ శోకచంద్రంలో మునిపోయింది. పలుపురు సినీ, రాజకీయ ప్రముఖులు కె.విశ్వనాథ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి సామాన్యమైన కథలను తన ప్రతిభతో.. వెండితెర దృశ్యకావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసించారు.
కె. విశ్వనాథ్ 5దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమకు సేవలు అందించారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా సినీజీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్గా పనిచేశారు.
1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాతో సినిమా ప్రస్థానాన్ని కె. విశ్వనాథ్ ప్రారంభించారు. ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్లోనూ 9 చిత్రాలను తెరకెక్కించారు. నటుడిగానూ కె. విశ్వనాథ్ మెప్పించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి సినిమాలు ఆయన ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టాయి. ఎన్నో అవార్డులు, పురస్కారాలు కళాతపస్వి అందుకున్నారు.