Gunasekhar: టాలీవుడ్లో హిరణ్యకశ్యప సినిమా వివాదం మొదలైంది. అమెరికాలోని శాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్కు వెళ్లిన దగ్గుబాటి రానా.. అకస్మాత్తుగా హిరణ్యకశ్యప సినిమాను ఎనౌన్స్ చేశాడు. తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ స్పిరిట్ మీడియా కింద ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇవ్వనున్నారు. అయితే ఈ సినిమాను గతంలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఎనౌన్స్ చేశాడు. రాణా దగ్గుబాటి హీరోగా ఆయన ప్రొడక్షన్లోనే గుణశేఖర్ ఈ సినిమాను ప్రకటించారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా వాయిదాపడుతూ వచ్చింది.
రుద్రమదేవి సినిమా తర్వాత హిరణ్య కశ్యప తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గుణశేఖర్ గతంలో ఎనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ వాయిదా పడడం, ఆ తర్వాత ఆయన శాకుంతలం సినిమా తీయడం, అది అట్టర్ ప్లాప్ కావడం జరిగిపోయాయి. శాకుంతలం డిజాస్టర్ అవడంతో.. హిరణ్య కశ్యప ప్రాజెక్ట్పై నిర్మాత కమ్ హీరో రానా వెనక్కి తగ్గారు.
ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో అని చర్చ జరుగుతున్న వేళ.. ప్రాజెక్ట్ K కోసం అమెరికా వెళ్లిన రానా.. అక్కడ హిరణ్య కశ్యప మూవీని ప్రకటించారు. ఊహించని విధంగా ఆ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారని పేరును ప్రకటించారు. దీంతో వివాదం మొదలైంది.
ఎప్పుడైతే గుణశేఖర్ పేరు లేకుండా కేవలం త్రివిక్రమ్ పేరుతో సినిమా పేరు ప్రకటించడంతో… గుణశేఖర్ ఫైర్ అవుతున్నారు. దేవుడు పేరుతో సినిమా చేస్తున్నపుడు.. దేవుడు కూడా అన్నీ గమనిస్తూనే ఉంటాడంటూ ట్వీట్ చేశారు గుణశేఖర్. ఒకరికి అన్యాయం చేసేలా అనైతికంగా వ్యవహరిస్తే.. దేవుడికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందంటూ పరోక్షంగా రానా దగ్గుబాటిని ఉద్దేశించి ట్వీట్ చేసారు. అలాగే దగ్గుబాటిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు గుణశేఖర్.
హిరణ్య కశ్యప ప్రాజెక్ట్తో తాను రానా దగ్గుబాటి దగ్గరకు వెళ్లానని.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి ఆయన ఎగ్జిట్ అయ్యారన్నారు. అయితే ఇప్పుడు తన ప్రాజెక్ట్, తాను చెప్పిన సేమ్ ఐడియా, కథతో.. వేరొకరితో రానా సినిమా తీస్తానంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. సినిమాల్లో ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలన్నారు. గుణశేఖర్ హెచ్చరిక నేపథ్యంలో రానా ప్రకటించిన హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేదానిపై టాలీవుడ్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనిపై గుణశేఖర్ చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే గుణశేఖర్ వార్నింగ్పై రానా దగ్గుబాటి ఇంకా స్పందించలేదు.