Prakash Raj Comments : ప్రకాష్ రాజ్ .. టాలీవుడ్ లో ఎటువంటి పాత్రకైనా సెట్ అయ్యే విలక్షణ నటుల్లో ఆయన కూడా ఒకరు. హీరో నుంచి విలన్ వరకూ.. తండ్రి నుంచి తాత వరకూ.. ఎటువంటి పాత్రలో అయినా ఇమిడిపోయే తత్వం కలిగిన ఒక గొప్ప నటుడు ప్రకాష్ రాజ్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మొన్న నేషనల్ అవార్డ్స్ సెలబ్రేషన్స్ కోసం మైత్రి సంస్థ వారు నిర్వహించిన పార్టీ వేదికపై టాలీవుడ్ పెద్దల గురించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని రేపాయో అందరికీ తెలుసు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు తిరిగి వైరల్ అయ్యాయి. నేషనల్ అవార్డ్స్ గురించి ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో టాలీవుడ్ పెద్దలపై మరోసారి విమర్శలు కురిపించాడు. 25 సంవత్సరాల క్రితం ప్రకాష్ రాజ్ నటించిన అంతఃపురం చిత్రానికి గాను అతనికి నేషనల్ అవార్డు వచ్చింది. తన వయసుకు మించి ఒక ఊరి పెద్ద పాత్రలో ప్రకాష్ రాజ్ ఆ చిత్రంలో అద్భుతంగా నటించాడు. ఒక విలన్ గా, ఊరి పెద్దగా, తల్లి నుంచి కొడుకుని దూరం చేయాలి అనే మామ గా.. ప్రకాష్ రాజ్ నటన ఎంత అద్భుతంగా ఉందో.. ఆ మూవీలో సౌందర్య నటన అంతకుమించి ఆకట్టుకుంది.
1998లో విడుదలైన అంతఃపురం చిత్రం జాతీయ అవార్డుతోపాటు పలు రకాల అవార్డులను కైవసం చేసుకుంది. అయితే 25 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్ కు నేషనల్ అవార్డు వచ్చినా టాలీవుడ్ పెద్దలు ఎవరు అతన్ని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రకాష్ రాజ్ మరోసారి టాలీవుడ్ పెద్దలను విమర్శించారు.
ఇక అప్పటినుంచి ప్రకాష్ రాజ్ చాలా వరకు అవార్డు ఫంక్షన్స్ కి దూరంగా ఉంటూ వస్తున్నారట. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ తోపాటు నేషనల్ అవార్డు తెచ్చుకున్న పలువురు తెలుగు సినీ ప్రముఖులను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సన్మానించిన సందర్భంగా నిర్వహించిన ఫంక్షన్ కు ప్రకాష్ రాజ్ వచ్చారు. ఆ వేదిక పైనే అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడం తెలుగు వారికి అందరికీ ఎంతో గర్వకారణం అని పొగిడిన ప్రకాష్ రాజ్.. ఇలాంటి సన్మాన వేడుకలకు తెలుగు హీరోలతోపాటుగా ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు.
ఇటువంటి అవార్డులు రావడం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదని అది మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీకి గర్వకారణం అని పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. ఇలా అవార్డులు వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రశంసించుకోవడం.. ఎందుకో మన వాళ్ళు మర్చిపోతున్నారు అని కూడా అన్నారు. అలాగే మన ఇంట్లో వాళ్ళను మనం గౌరవించుకోకపోతే బయట వాళ్ళు మనల్ని ఎందుకు గౌరవిస్తారు.. ఇలాంటి వివక్ష భరించలేక నేను ఇంతకాలం సినిమా వేడుకలకు దూరంగా ఉన్నాను అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.