Dhanush Divorce : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విడాకుల వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐశ్వర్యతో ధనుష్ విడాకుల వ్యవహారంపై కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ జంట నేడు విచారకు హాజరు కావలసి ఉండగా, ఇద్దరూ గైర్హాజరు అయ్యారు. దీంతో మరోసారి ధనుష్, ఐశ్వర్యల విడాకుల కేసు వాయిదా పడింది. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడడం చూస్తుంటే ఈ కేసులో కావాలనే ఇటు ధనుష్, అటు ఐశ్వర్య జాప్యం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
రెండేళ్ల క్రితమే విడాకుల పిటిషన్
2004లో లవ్ మ్యారేజ్ చేసుకున్న ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దాదాపు 18 ఏళ్లపాటు వైవాహిక జీవితాన్ని కంటిన్యూ చేశారు.. ఈ జర్నీలో వారికి లింగా, యాత్ర అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా బాగానే ఉన్న ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోవాలని డిసైడ్ అయ్యారు. 2022లో విభేదాల కారణంగా తామిద్దరం విడిపోతున్నామని అఫీషియల్ గా సోషల్ మీడియా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు ఈ మాజీ దంపతులు. ఈ షాకింగ్ వార్తతో అటు రజినీ అభిమానులు ఇటు ధనుష్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తరువాత ఈ జంట మళ్లీ కలిసే ఛాన్స్ ఉందని రూమర్లు విన్పించినా అది జరగలేదు. ఇక అప్పటి నుంచి ఈ జంట వేరుగానే ఉంటున్నారు.. ఈ నేపథ్యంలోనే ధనుష్ ఐశ్వర్య ఇద్దరూ కలిసి తమ వైవాహిక సంబంధాన్ని ఇంకా కంటిన్యూ చేయలేమంటూ మ్యూచువల్ డివోర్స్ కోసం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో రెండు ఏళ్ల క్రితమే పిటిషన్ వేశారు. పిటిషన్ అయితే వేశారు కానీ ఇప్పటిదాకా కోర్టులో ఈ జంట హాజరు కాకపోవడం గమనార్హం.
వాయిదాల మీద వాయిదాలు…
నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లోనే ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ న్యాయస్థానం ముందు హాజరవ్వాలని కోర్టు నోటీసులు పంపింది. కానీ పలు కారణాల వల్ల ఇద్దరూ హాజరు కాకపోవడంతో అక్టోబర్ 7 కు విచారణ వాయిదా వేశారు. కానీ ఈరోజు కూడా ఇద్దరు కోర్టులో హాజరు కాకపోవడంతో ఈ విడాకుల కేసును అక్టోబర్ 19కి వాయిదా వేసినట్టు తాజాగా న్యాయమూర్తి వెల్లడించారు. కాగా ఈ జంటను కలపడానికి రజనీకాంత్ తీవ్రంగా ప్రయత్నించారని వార్తలు వినిపించాయి. అయినప్పటికీ ఇద్దరు డివోర్స్ తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో కోర్టు మెట్లు ఎక్కారు. కానీ ఇప్పుడు విచారణ మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండడంతో ధనుష్ అభిమానులు మళ్లీ ఈ జంట ఒక్కటవ్వాలని కోరుకుంటున్నారు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ హార్ట్ సర్జరీ కారణంగా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య రజనీకాంత్ కోర్టులో ఈరోజు విచారణకు హాజరు కాకపోయి ఉండొచ్చు. మరి అక్టోబర్ 19న అయినా ధనుష్, ఐశ్వర్య న్యాయస్థానం ముందు ఈ కేసులో విచారణకు హాజరవుతారా? అన్నది చూడాలి. మరోవైపు ధనుష్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.