JR NTR : ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ జపాన్లో దాదాపు 155 సార్లు భూమి కంపించింది. కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టీ పెట్టగానే ప్రకృతి ప్రకోపించింది. వరుస భూకంపాల ధాటికి పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా సంభవించిన భూకంపాలతో తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది.
జపాన్లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ X వేదికగా స్పందించారు. జపాన్ లో సంభవించిన భూకంపాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో షూటింగ్ ముగించుకొని తిరిగి న్యూ ఇయర్ రోజున రాత్రి ఆయన హైదరాబాద్ వచ్చారు. జపాన్లో వారం రోజులు ‘దేవర’ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే భూకంపం రావడం తన హృదయాన్ని కలచివేసిందని ఎన్టీఆర్ అన్నారు. “భూకంప ప్రభావిత ప్రాంత ప్రజల గురించి ఆలోచిస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అందరూ ధైర్యంగా ఉండాలి” అని ఎన్టీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.