Darshan Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురికి బెయిల్ దొరికింది. ఆ బెయిల్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎవరు? వాళ్ళకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? మరి దర్శన్ కూడా బెయిల్ దొరుకుతుందా? అనే విషయాలను తెలుసుకుందాం.
రేణుకా స్వామి కేసులో ముగ్గురికి బెయిల్
కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసు విచారణ ముగిసింది. రేణుకా స్వామిని దర్శన్, అతని గ్యాంగ్ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దర్శన్, పవిత్ర గౌడ, ప్రదోష్, పవన్ తదితరులు ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఘటన పెను సంచలనం సృష్టించడంతో ఈ దారుణమైన ఘటనలో భాగమైన కొందరు లొంగిపోయారు. వారిలో కార్తీక్, నిఖిల్ నాయక్, కేశవమూర్తి కూడా ఉన్నారు. ఈ కేసులో కార్తీక్ ఏ15, కేశవమూర్తి ఏ16, నిఖిల్ నాయక్ ఏ17గా ఉన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన బెంగళూరు పోలీసులు ఇటీవలే చార్జిషీటును దాఖలు చేశారు. ఆ తర్వాత నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో కార్తీక్, నిఖిల్, కేశవమూర్తిలకు ఈరోజు అంటే సెప్టెంబర్ 23న బెయిల్ మంజూరైంది. ఈ కేసులో తాజాగా బెయిల్ రావడంతో నిందితులైన ముగ్గురికి ఉపశమనం లభించింది. సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఈ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. కార్తీక్ పట్టనగెరెలోని ఓ షెడ్డులో పని చేస్తున్నాడు. శవాన్ని తీసుకెళ్లిన ముఠాలో నిఖిల్, కార్తీక్ ఉన్నారు. తర్వాత కేశవమూర్తి కూడా ఈ కేసులో లొంగిపోయాడు. బెయిల్ వచ్చిన నేపథ్యంలో రేణుకా స్వామి హత్య కేసులో నిందితుల జాబితా నుంచి ఆ ముగ్గురు పేర్లను తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. గత 3 నెలల నుంచి కొనసాగుతున్న ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, వాళ్ళంతా ఇప్పుడు వేరే వేరే జైళ్ళలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
దర్శన్ సంగతేంటి?
రేణుకా స్వామి హత్య కేసులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్ ఉన్నారు. ఈ కేసు వెలుగులోకి రాగానే దర్శన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అతనికి కఠినమైన శిక్ష పడాలంటూ డిమాండ్ గట్టిగా విన్పించింది. ఈ క్రమంలోనే దర్శన్ భార్య విజయ లక్ష్మీ దర్శన్ బెయిల్ కోసం చేయని ప్రయత్నం లేదు. రేణుకా స్వామిని హత్య చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ కు ఈ కేసులో సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉండడంతో బెయిల్ రావడం కష్టమే అని అంటున్నారు. చార్జ్షీట్ సమర్పించిన అనంతరం దర్శన్ కు బెయిల్ తీసుకు రావడం గురించి న్యాయవాదులతో కలిసి వీలైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, సెప్టెంబర్ 23న పవిత్ర గౌడ, దర్శన్ ఇద్దరి బెయిల్ పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం పవిత్ర గౌడ బెయిల్ పిటిషన్పై విచారణ సెప్టెంబర్ 25న, దర్శన్ బెయిల్ పిటిషన్పై సెప్టెంబర్ 27కు వాయిదా పడింది. ప్రస్తుతం దర్శన్ బళ్లారి జైలులో ఉన్నాడు.