Couple arrange their marriage by watching Murari movie at Hyderabad: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని సామెత. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పెళ్లిళ్లు సినిమా థియేటర్లలోనే జరుగుతాయని నిరూపించారు ఆ జంట. అదేదో ఖాళీగా ఉన్న థియేటర్ లో అనుకుంటే పొరపాటే. తమ అభిమాన హీరో సినిమా వెండితెరపై దేదీప్యమానంగా ప్రదర్శితమవుతుండగా థియేటర్లో ప్రేక్షకులు అటు సినిమాలో వచ్చే పెళ్లి పాట సీను ఇటు యువతీ యువకుల పెళ్లి ని లైవ్ లో వీక్షించి వధూవరులను అక్షింతలు, పూలతో ఆశీర్వదించి హ్యాపీగా ఫీలయ్యారు. ఇది ఎక్కడో జరగలేదు. హైదరాబాద్ లో ఓ థియేటర్ లో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజున జరగడం విశేషం.
23 సంవత్సరాల తర్వాత వచ్చిన మురారి
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు సినిమా ఏదీ ఇంతవరకూ అప్డేట్ కాలేదు. రాజమౌళి కాంబినేషన్ లో బర్త్ డేనాడైనా ఏదైనా ఓ చిన్న క్లారిటీ వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే అదేమీ జరగలేదు. అయితే గత వారం రోజులుగా మురారి మూవీ రీ రిలీజ్ ప్రకటించారు నిర్మాతలు. ఈ మధ్య రీరిలీజుల ట్రెంట్ ఎక్కువయింది. కేవలం ఆ ఒక్కరోజు రీరిలీజ్ చేసి అడ్వాన్స్ గా టిక్కెట్లు అమ్ముతుంటే మూడు నుంచి నాలుగు కోట్లు వసూళ్లవుతున్నాయి. 23 సంవత్సరాల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది మురారి. మహేష్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మూవీ ఇది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని బాగా ఆదరించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మ్యుజికల్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా మహేష్,సోనాలి బింద్రే ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత విడుదలయిన మురారి సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో కనకవర్షం కురిపించింది.
ప్రేక్షకాభిమానులే పెళ్లి పెద్దలు
అయితే ఆన్ లైన్ లో తమ అభిమాన హీరో సినిమా టిక్కెట్లను ఓ ప్రేమికుల జంట కూడా బుక్ చేసుకున్నారు. వాళ్లిద్దరూ మహేష్ బాబు వీరాభిమానులే కావడం విశేషం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో థియేటర్ లో మహేష్ ఫ్యాన్స్ హంగామా మొదలయింది. టిక్కెట్లన్నీ ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న అభిమానులు సినిమా చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ సినిమా ఆఖరులో వచ్చే పెళ్లి పాట సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఈ పాట కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూశారంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే పాటలో మహేష్ బాబు సోనాలి బింద్రేకి తాళికట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తూ ఓ యువజంట థియేటర్ లో అందరూచూస్తుండగానే స్టేజిపైకి ఎక్కి తాళి బొట్టుతో ప్రత్యక్షమయ్యారు. పాట జరుగుతుండగానే వరుడు వధువు మెడలో తాళి కట్టేశాడు. ఇంకేముంది థియేటర్ మొత్తం మహేష్ వీరాభిమానులు ఈ జంటపై పూల జల్లు కురిపించారు. అక్కడికక్కడే దండలు తెప్పించారు. అభిమానుల సమక్షంలో తమ పెళ్లి జరగడంతో ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మనసారా ఆశీస్సులు
సినిమా అయిపోయాక మహేష్ అభిమానులు ఈ జంట కోసం కేకును కూడా తెప్పించి మరీ కోయించి ఎవరికి తోచినంతలో వారు కానుకలు కూడా ఇచ్చారు. అయితే ఈ జంట చేసిన పనికి అభిమానులయితే హర్షిస్తున్నారు. కొందరైతే థియేటర్ లో పెళ్లి చేసుకోవడమేమిటి వింత కాకపోతే అంటూ ట్రోలింగులు గుప్పిస్తున్నారు. ఈ కాలం పిల్లలు మరీ ఇలా బరితెగించి ఇంట్లో పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా చేసుకోవడం ఏమిటని కొందరు పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా ఇదో హాట్ టాపిక్ గా మహేష్ బర్త్ డే రోజున జనం మాట్లాడుకోవడం విశేషం.