KE Gnanavel Raja: గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ బాగా పెరిగిపోయింది. కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్లో ఎక్కువగా తెలుగు చిత్రాలే ఉంటున్నాయి. అయినా కూడా ఈ సినిమాలను ట్రోల్ చేస్తున్నవారు కూడా ఉంటారు. ఇతర ఇండస్ట్రీలకు చెందినవారు సైతం తెలుగు సినిమాలను ట్రోల్ చేయడంలో ముందుంటున్నారు. తాజాగా ఒక తమిళ నిర్మాత సైతం ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ సినిమాల గురించి తక్కువ చేస్తూ మాట్లాడారు. దీంతో ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాటినే టార్గెట్
ఎన్నో ఏళ్లుగా తమిళంలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు కేఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja). తాజాగా ఆయన భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ‘కంగువా’.. త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. సూర్య హీరోగా శివ దర్శకత్వం తెరకెక్కిన చిత్రమే ‘కంగువా’ (Kanguva). త్వరలోనే విడుదలకు సిద్ధం కావడంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ట్విటర్లో సూర్య ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు కేఈ జ్ఞానవేల్ రాజా. అయితే తమ సినిమా గురించి గొప్పగా చెప్పడం కోసం ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ సినిమాలను టార్గెట్ చేస్తూ వాటి గురించి తక్కువ చేసి మాట్లాడారు ఈ స్టార్ ప్రొడ్యూసర్.
Also Read: “కంగువ” ఆడియో లాంచ్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్
పెద్ద రిస్క్
‘కంగువా’ సినిమా శాటిలైట్ రైట్స్ గురించి మాట్లాడిన కేఈ జ్ఞానవేల్ రాజా.. ‘‘ఇప్పటికీ కంగువా శాటిలైట్ రైట్స్కు భారీ డిమాండ్ ఉంది. కల్కి 2898 ఏడీ, దేవర లాంటి సినిమాలు కూడా ఇంకా శాటిలైట్ రైట్స్ను అమ్మడానికి కష్టపడుతున్నాయి’’ అని అన్నారు. దీంతో అసలు ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ సినిమాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది అని ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమయ్యింది. అంటే తమిళంతో పాటు ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కానుంది. ఇలాంటి సమయంలో తెలుగు సినిమాలపై కామెంట్స్ చేయడం ఎంత రిస్క్ అని జ్ఞానవేల్ ఆలోచించలేదని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోలీవుడ్ డెబ్యూ
ఇప్పటికే ‘కంగువా’ మూవీ పలుమార్లు విడుదలను వాయిదా వేసుకుంది. ఫైనల్గా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ శివ, హీరో సూర్య కాంబినేషన్లో ఇప్పటికే ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాలు వచ్చాయి. కానీ వాటన్నింటికి భిన్నంగా ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్తో ‘కంగువా’ను తెరకెక్కించారు శివ. ఇందులో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన దిశా.. ‘కంగువా’తో కోలీవుడ్లో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది. బాబీ డియోల్ ఇందులో విలన్గా భయపెట్టనున్నాడు.