Cinema Actor Anupam Kher Recalls: కెరీర్ ప్రారంభంలో ఆర్థికంగా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, డబ్బులు లేకపోవడంతో కొన్నిసార్లు రైల్వే ప్లాట్ ఫామ్ పై పడుకునేవాడిని అంటూ ప్రముఖ సినిమా నటుడు అనుపమ్ ఖేర్ తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. ‘ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ ద మ్యాన్’ సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని తన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం గురించి గుర్తుచేసుకున్నారు. ఈ 40 ఏళ్ల ప్రయాణంలో తాను పడ్డ కష్టాలు, ఇబ్బందుల గురించి వివరించారు.
‘సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ కంటే హెయిర్ స్టైల్ రాజ్యమేలుతున్న సమయంలోనే నేను నటుడిని కావాలనుకున్నాను. అయితే, నేను ముంబైకి వచ్చినప్పుడు బట్టతలతో చాలా సన్నగా ఉండేవాడిని. అంతగా అందంగా ఉండేవాడిని కాదు. అయినా సరే టాలెంట్ మాత్రమే ముఖ్యమని నేను బలంగా నమ్మాను. అలా నమ్మాను కాబట్టే 28 ఏళ్ల వయసులోనే 65 ఏళ్ల వ్యక్తిగా నటించాను. ఇప్పటికీ నేను నటించే ప్రతీ పాత్ర కూడా వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటాను. అందువల్లనే నేను ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను అని భావిస్తాను. కెరీర్ ప్రారంభ సమయంలో ఆర్థికపరంగా చాలా సమస్యలు ఎదుర్కున్నాను. రైల్వే ప్లాట్ ఫామ్ పై పడుకునేవాడిని. అయినా కూడా నేను పనిచేసే అవకాశం ఇవ్వమని తప్ప భగవంతుడిని ఇంకేమీ కోరలేదు’ అంటూ అనుపమ్ ఖేర్ తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు.
Also Read: అమ్మోరు సినిమాలో అమ్మవారుగా నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
అదేవిధంగా డ్యాన్స్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ.. తనకు డ్యాన్స్ చేయడం రాదు కానీ, తన యాక్టింగ్ లోనే డ్యాన్స్ ఉందని తాను అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, 28 ఏళ్ల వయసులోనే 65 ఏళ్ల వ్యక్తిగా ఆయన నటించిన సినిమా ‘సారాంశ్’. 1984 లో ఈ సినిమాను తీశారు. 1987లో అనుపమ్ ‘త్రిమూర్తులు’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, పంజాబీ, మరాఠీ, ఇంగ్లీష్, చైనీస్ చిత్రాల్లోనూ అనుపమ్ నటించారు. తెలుగులో విడుదలైన ‘కార్తీకేయ 2’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాల్లో కూడా నటించి ఎంతగానో ప్రేక్షకులను అలరించారు.