Vikram: హీరోలు అంటే కేవలం.. తెరపై మంచి చేసేవారే కాదు.. తెరవెనుక కూడా తమను అభిమానించే అభిమానులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వారికి సహాయం చేసేవారు. అలాంటివారు మన సౌత్ ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పుకోవడం గర్వకారణం. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మన హీరోలు ఎప్పుడు ముందు ఉంటారు.
ఇక కేరళలోని వయనాడ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి 150కి పైగా ప్రజలు మృత్యువాత పడ్డ విషయం తెల్సిందే. ఇంకా వందలమంది ప్రజలు శిథిలాల క్రింద చిక్కుకుపోయారు. కేరళ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయిందని తెలుస్తోంది. ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుంది. ఇంకోపక్క కేరళ పరిస్థితి తెలుసుకొని ప్రముఖులు ఎంతో దిగ్బ్రాంతికి గురవుతున్నారు. చిక్కుకున్నవారు క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. వయనాడ్ బాధితులకు భారీ విరాళాన్నీ అందజేశాడు. తనవంతు సాయంగా ప్రభుత్వానికి రూ. 20 లక్షలు అందించాడు. ఈ విషయాన్నీ విక్రమ్ మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
” కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడటం వల్ల 150 మందికి పైగా మరణించారు. 197 మంది గాయపడ్డారు, అనేక మంది తప్పిపోయారు. ఈ విధ్వంసం చూసిన విక్రమ్ ఎంతో బాధ పడ్డారు. తనవంతు సాయంగా ఈరోజు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు విక్రమ్ గొప్ప మనసును ప్రశంసిస్తున్నారు.
ఇక విక్రమ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన తంగలాన్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఎన్నో వాయిదాల తరువాత తంగలాన్ ఆగస్టు 15 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Pained by the sad news of the devastation caused by the recent landslide in Kerala's #Wayanad district that left over 150 people dead, 197 injured and several others missing, Actor @chiyaan today donated a sum of Rs 20 lakhs to the Kerala Chief Minister's Distress Relief Fund.… pic.twitter.com/mxb7O7YSSN
— Yuvraaj (@proyuvraaj) July 31, 2024