Chiranjeevi : అగ్ర కథానాయకుడు చిరంజీవి జీవిత చరిత్ర త్వరలో పుస్తక రూపంలోకి రానుంది. తన బయోగ్రఫీ రాసే బాధ్యతను రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అప్పగిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ వేదికపై ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్ శత జయంతి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై ప్రసంగించారు. తన సినీ ప్రస్థానం గురించి ఆసక్తిగా రాయగల శక్తి యండమూరికే ఉందని తెలిపారు. చిరంజీవి నటించిన ఛాలెంజ్, అభిలాష సినిమాలను యండయూరి నవలల ఆధారంగా తెరకెక్కించామని అన్నారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తో కలిసి సత్కరించారు. తర్వాత సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు చెక్కును అందించారు.
బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షులు రాధాకృష్ణంరాజు దంపతులు, మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బారెడ్డి, అంతర్జాతీయ పర్యటన శాఖ నిపుణులు, కవి పండితులు టి.విల్సన్ సుధాకర్ లను సత్కరించారు. వీరికి ఫౌండేషన్ అందించిన జీవన సౌఫల్య పురస్కారాలు, వేర్వేరుగా రూ. 50 వేల చెక్కులు అందించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, ఎంపీ లావు కృష్ణదేవరాయులు, గంటా రవితేజ, దసపల్లా హోటల్ అధినేత రాఘవేంద్రరావు, పైడా కృష్ణప్రసాద్ దంపతులు హాజరయ్యారు.